గంజాయి కోసం లారీలో సీక్రెట్ ఛాంబర్
గుట్టురట్టు చేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు
రూ.3.64కోట్ట విలువైన నిషేధిత గంజాయి స్వాధీనం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 12)
స్మగ్లర్లకు పుష్ప సినిమా ఇన్స్పిరేషన్ ఇంకా తగ్గుతున్నట్లు లేదు. మరోసారి ఆ సినిమాను తలపిస్తూ, గంజాయి అక్రమ రవాణా కోసం లారీ క్యాబిన్ కు, వెనుక ఉండే ట్రక్కుకు మధ్యభాగంలో ఎవరికీ కనపడకుండా ఒక సీక్రెట్ చాంబర్ లాగా తయారు చేశారు. అందులో గంజాయి అమర్చుకుని తిరిగి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు సీక్రెట్ గా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ఈ సంఘటనలో పోలీసులు భారీమొత్తంలో దాదాపు రూ.3.64కోట్ల విలువైన 737.36 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి… శనివారం (ఏప్రిల్ 12వ తేదీ) ఉదయం 9-30 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా వన్ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలలో UP82, AT-9894 అనే నెంబరు కలిగిన లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 727.360 కిలోల నిషేదిత గంజాయిని గుర్తించారు. దాదాపు రూ.3,63,68,000 విలువ గల ఆ గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విదారణ చేపట్టారు.
———————–
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడి
———————–
లారీలో పట్టుబడిన గంజాయిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరానికి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణ ద్వారా తేలింది. ఆగ్రా జిల్లా భోదలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్ పుర ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శివంగుప్తా ఆ గంజాయి అక్రమ రవాణా వెనుక సూత్రధారిగా వెల్లడైంది. పట్టుబడిన లారీలోని వ్యక్తులను ఆగ్రా జిల్లా నాగులబుద్ధ గ్రామానికి చెందిన భూరిసింగ్, అదే జిల్లాలోని భోగిపురం గ్రామానికి చెందిన రవికుమార్ అనేవారిగా పోలీసులు ప్రకటించారు. వ్యాపారి శివంగుప్తా ఆ ఇద్దరికీ ఏప్రిల్ 8వ తేదీన డబ్బులిచ్చి, అల్లూరి సీతా రామరాజు జిల్లా, చింతూరు మండలం పరిధిలోని తులసిపాక గ్రామం అటవీ ప్రాంతంలో నిషేధిత గంజాయిని లోడ్ చేసుకుని రావాల్సిందిగా చెప్పి పంపించాడు. ఏప్రిల్ 10తేదీన ఆ ఇద్దరు తులసిపాక చేరుకుని అక్కడ ఏడుగురి వద్ద నుంచి 727.360 కిలోల గంజాయి తీసుకుని లారీక్యాబిన్, ట్రక్కుకు మధ్య భాగంలో ఎవరికీ కనపడకుండా ఒక చాంబర్ లాగా తయారు చేసి, అందులో అమర్చుకున్నారు. భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు గంజాయి తరలించే ప్రయత్నంలో పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో శనివారం కొత్తగూడెం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులు, కొనుగోలు చేసిన వ్యక్తులు, రవాణా చేస్తున్న వ్యక్తులు అందరిపై కేసు నమోదు చేసి, రవాణాకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా సిజ్ చేశారు. గంజాయి తరలిస్తూ లారీ సహా పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులకు గంజాయి విక్రయించిన వారిని కొర్రా సీతారాములు, వంతాల విశ్వనాథ్, వంతాల బాబూరావు, కిలో చిన్నారావు, కిలో సాయిబాబు, కిలో శంకర్రావు, భద్రి అనేవారుగా గుర్తించిన పోలీసులు, వారిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పట్టుబడిన ఇద్దరినీ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కొత్తగూడెం 1 టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై విజయ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

