గరుడ వాహనంపై విహరించిన లోకాభిరాముడు



✍️ తిరుపతి – దివిటీ (మార్చి 31)
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి స్వామివారు గరుడవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమవగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాలుగా సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు కనులవిందు చేసింది. 108 దివ్య దేశాల్లోనూ గరుడ సేవ విశిష్టమైనదిగా భక్తుల నమ్మకం.