రానున్న 48గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులను అలెర్ట్ చేసిన సీఎం
✍️ హైదరాబాద్ – దివిటీ (మార్చి 21)
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రానున్న 48 గంటలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పరిస్థితిపై వెంటనే సంబంధిత జిల్లాలకు చెందిన కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయనే సూచన ఉన్నందున ఆ ప్రాంత అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ, అందుకు అవసరమైన సూచనలు చేశారు.