ట్రైబల్ మ్యూజియం పనులు సందర్శించిన ఐటీడీఏ పీఓ
✍️ భద్రాచలం – దినిటీ (మార్చి 19)
భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తెలిపే పెయింటింగ్స్ తోపాటు గిరిజన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ నిర్మాణం, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు శనివారంనాటికల్లా పూర్తిచేసి మ్యూజియంను విద్యుత్ కాంతులతో సర్వసుందరంగా అలంకరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. బుధవారం ఆయన ట్రైబల్ మ్యూజియంను సందర్శించి, బోటింగ్ ప్రదేశాలు, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, మ్యూజియం లోపల జరుగుతున్న పెయింటింగ్స్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నందున శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలు తిలకించడానికొచ్చే భక్తులు తప్పని సరిగా ట్రైబల్ మ్యూజియం సందర్శించే విధంగా సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందుకే ఏ ఒక్కపని మిగలకుండా పూర్తి స్థాయిలో అన్ని పనులు పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం చిన్నారుల బోటింగ్ సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, గిరిజన ఆచార వ్యవహారాలు, వారి కట్టుబాట్లకు సంబంధించిన పెయింటింగ్స్ పనులు శుక్రవారంలోగా పూర్తి కావాలన్నారు. సందర్శకులు సాంప్రదాయమైన గిరిజన వంటకాలు రుచిచూడడానికి ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ రేపట్లోగా పూర్తికావాలని, ప్రస్తుతం మ్యూజియంలో వాష్ రూమ్స్, టాయిలెట్స్ ఏమైనా రిపేర్లుంటే వెంటనే పనులు ప్రారంభించాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్ ను ఆదేశించారు.ఇంకా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఏమైనా గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్స్ వేయించాలని, మ్యూజియం ప్రవేశ ద్వారం దగ్గర ‘గిరిజనపల్లెల్లో రచ్చబండ’ పెయింటింగ్ పూర్తిస్థాయి డిజైన్ తో వేయించాలని, స్వాగతద్వారం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ పనులు ప్రారంభించాలన్నారు. ఈ సందర్భంగా గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్స్ ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఎసీఎంఓ రమణయ్య, డిఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఏఈ రవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.