గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు

రాష్ట్ర ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ వెల్లడి
కలెక్టర్లతో జూమ్ మీటింగులో సమీక్ష
✍️ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 13)
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించిన ఆయన ఇప్పటికే రాష్ట్రంలో 70ఏటీసీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఐటీఐ, ఏటీసీలు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం ఒకటి చొప్పున సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏటీసీల నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్థలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 45 ఏటీసీలను గ్రామీణ నియోజకవర్గాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. రోడ్డు, రవాణా వసతితో పాటు సమీపంలో పరిశ్రమలున్న స్థలాలు ఎంపిక చేస్తే ఏటీసీలలో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు, ఇన్ స్ట్రక్టర్లు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. పరిశ్రమల చేరువలో ఏటీసీలు ఏర్పాటు చేస్తే, ఆ పారిశ్రామిక అంశాలతో కూడిన ట్రేడ్లలో యువతకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు చేపట్టవచ్చన్నారు. తద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా దోహదపడినట్లవుతుందన్నారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుంటూ, అనువైన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో కూడిన నివేదికలను వెంటనే పంపాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సూచించారు.
—————-
అశ్వారావుపేటలో స్థలం గుర్తించాం : కలెక్టర్ జి.వి.పాటిల్
—————–
ఏటీసీల ఏర్పాటుపై నిర్వహించిన జూమ్ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ జి.వి పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, అశ్వారావుపేటలో ఐటీఐ స్థాపనకు స్థలం గుర్తింపు పూర్తయిందని తెలిపారు. గుర్తించిన స్థలం రహదారికి దగ్గరలో, ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా ఉందని, దగ్గరలో పరిశ్రమలు కూడా ఉన్నందున ఐటీఐ స్థాపనకు అన్ని రకాల అనువైన స్థలాన్ని గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అశ్వారావుపేట ఆయిల్ పామ్ హబ్ గా ఉందని, ఇక్కడ వ్యవసాయ కళాశాల కూడా ఉన్నందున ఐటీఐలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ స్పందించి, ఏ కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఎక్కువ లాభం చేకూరుతుందో తగిన నివేదికలు సమర్పించాలని కలెక్టర్ కు సూచించారు.