‘ఏఐ’తో బోధన విద్యార్థుల పాలిట వరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 10)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనున్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అభిప్రాయపడ్డారు. సోమవారం బూర్గంపాడు మండలంలోని అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో విద్యాబోధనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల అభ్యాసన మరింత ఆకర్షణీయంగా, ఇంట్రాక్టివ్ గా నిర్వహించటానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మెరుగ్గా సహకరిస్తుందని తెలిపారు. విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ, అందుకు తగినట్లుగా అభ్యాస కృత్యాలు జనరేట్ చేయడం కారణంగా విద్యాభ్యాసం పట్ల మరింత ఉత్సాహం పెంచేలా బోధన చేయవచ్చన్నారు. విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ లో కలెక్టర్ ముచ్చటిస్తూ, చిన్నారులకు ఉత్సాహమే ప్రేరణ ఆధారిత విద్యాబోధనను జిల్లాలో ప్రారంభించామన్నారు. పిల్లలందరూ నిరంతరాయంగా ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్ వినియోగించాలన్నారు. బూర్గంపాడు మండలంలో అంజనాపురం, మోరంపల్లిబంజర, బూర్గంపాడు-2, నాగినేనిప్రోలు, సారపాకలోని గాంధీనగర్ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఏఐ ఆధారిత బోధనలో భాగంగా మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడిని హైదరాబాదుకు ఏఐ విద్యాబోధన శిక్షణకు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏఐ ఆధారిత విద్యా బోధనలో ఉపాధ్యాయుల తీరును సంబంధిత ఎంఈఓలు పర్యవేక్షిస్తూ, ఆ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
—————–
ఆశ్రమ విద్యాలయం ఆకస్మిక తనిఖీ …
——————
మండల పర్యటనలో భాగంగా కలెక్టర్, సోమవారం బూర్గంపాడులోని ఆశ్రమ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, కిషన్ షెడ్, పాఠశాల ఆవరణలను క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు పుస్తక పఠనంలో ఉన్న నైపుణ్యం చూసేందుకు వారితో హిందీ పాఠ్యపుస్తకం చదివించి పరిశీలించారు. విద్యార్థులకు చదువుపై గల ఆసక్తి, పాఠశాలలో విద్యాబోధన, అమలు చేస్తున్న మెనూపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో అమలు చేసే మెనూ, లెసన్ ప్లాన్స్, టాయిలెట్స్ నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రశాంతమైన వాతావరణంలో చదవటానికి వీలుగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని ఆదేశించారు. ఆ విద్యాలయం ఆవరణలో నీరు నిల్వ లేకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడున్న సమస్యల పరిష్కారానికి కావలసిన ప్రణాళికలు రూపొందించి, నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట బూర్గంపాడు డిప్యూటీ తహసిల్దార్ రాంనరేష్, బూర్గంపాడు ఎంఈఓ యధునరసింహరాజు, పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.