మోరంపల్లిబంజరకు నూతన సి.హెచ్.సి మంజూరు

స్థలపరిశీలన చేసిన జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 10)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ లో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి) మంజూరైంది. ఈ మేరకు సి.హెచ్.సి నిర్మాణానికి అవసరమైన స్థలం మండల అధికారులు ఎంపిక చేయగా, ఆ స్థలాన్ని సోమవారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ స్వయంగా పరిశీలించారు. వేపలగడ్డ బస్టాండ్ సమీపంలో అధికారులు ఎంపిక చేసిన నాలుగు ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం ఎంపిక చేసిన ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన మండల అధికారులను ఆదేశించారు. పరిశీలన కార్యక్రమంలో బూర్గంపాడు డిప్యూటీ తహసిల్దార్ రాంనరేష్, పలువురు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.