మధ్యాహ్న భోజనం పరిశీలించిన జిల్లా కలెక్టర్







✍️ పాల్వంచ – దివిటీ (మార్చి 7)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మధ్యాహ్న భోజనం మెనూ పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం చేస్తూ కలెక్టర్ వారితో మమేకమై వారి బాగోగులను, భోజనంపై వారి అభిప్రాయాలు, ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆహారం తీసుకునే ముందు చేతులు సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. ఆహారాన్ని వదిలివేయరాదని, చక్కని ఆరోగ్యానికి ఆహారం సహకరిస్తుందని ఆయన చెప్పారు. పౌష్టికాహారం పట్ల అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా బాలికలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు. ఆహార పదార్థాలను వృధా చేయరాదని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను బాగా గ్రహించాలని అందుకు ఏకాగ్రత అవసరమని కలెక్టర్ అన్నారు. పాఠ్యాంశాలలో సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, వంట వండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. చిన్నారులకందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పాఠశాలకు మంజూరైన స్పోర్ట్స్ మెటీరియల్ కిట్లను పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు సరళతరం చేసేందుకు, అనుకూలంగా భోజనం చేసేందుకు వీలుగా కిచెన్ షెడ్, ఐరన్ పొయ్యి, బల్లలు, బెంచీలు ఏర్పాటుతోపాటు విద్యార్థులకు ప్రత్యేకంగా లంచ్ బాక్సుతో కూడిన బ్యాగ్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి, నివేదికలు అందించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వరచారి, జిల్లా కోఆర్డినేటర్ సైదులు, సతీష్ కుమార్, ఎంఈఓ రామ్మూర్తి, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.