వసతిగృహం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

✍️ భద్రాచలం – దివిటీ (మార్చి 6)
భద్రాచలం బీసీ బాలుర వసతిగృహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ వసతిగృహంలోని గదులు, మరుగుదొడ్లు, దుస్తులు ఎండబెట్టుకునే స్థలం, వంటగదిని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని రోజువారీగా ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆ వసతిగృహంలో గదుల తలుపులు, కిటికీలతోపాటు మరుగుదొడ్ల తలుపులు, మెయిన్ గేటు సరిగా లేకపోవటం గమనించిన కలెక్టర్, వెంటనే రిపేర్ చేయించవలసిందిగా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు భోజనం చేసేందుకు వసతిగృహంలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలతో నివేదించాలని బీసీ సంక్షేమ జిల్లా అధికారి ఇందిరను ఆదేశించారు. వసతిగృహంలో పరిశుభ్రత పాటించాలని, ప్రతిరోజు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ అందిస్తున్నతీరుపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏరోజుకారోజు బియ్యం శుభ్రంచేసి వంట చేయాలని సూచించారు. వసతిగృహంలో సమస్యల పరిష్కారానికి నివేదికలు అందజేస్తే, పరిష్కరిస్తామని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట బీసీ సంక్షేమాధికారి ఇందిర, వసతి గృహ సిబ్బంది ఉన్నారు.