చర్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం





ఏజెన్సీ యువత ప్రతిభ వెలికి తీసేందుకే క్రీడా పోటీలు : అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్
ఛత్తీస్గడ్ సరిహద్దు ఏజెన్సీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న జట్లు
✍️ చర్ల, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 5)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువత ప్రతిభను వెలికితెచ్చేందుకు బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో చర్లలో మూడు రోజుల మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) పంకజ్ పరితోష్ పాల్గొన్నారు. ఆయనతో పాటు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 49 గ్రామాల జట్లు నమోదు చేసుకున్నారు. టోర్నమెంటుకు జిల్లాకు సరిహద్దులో ఉన్న చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాల్లోని క్రీడాకారులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. యువతలో చాలా మంది రక రకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపు సాధించాలని సూచించారు. ఈ పోటీల్లో క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, గెలుపోటములు సహజమని అన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇటీవల మహిళల క్రికెట్లో తనదైన శైలిలో ప్రతిభ కనబరిచి టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించేలా కృషి చేసిన గొంగడి త్రిషను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత వారి ప్రతిభను చాటుకునేందుకుకు జిల్లా ఎస్పీ సారధ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏజెన్సీలోని ప్రజల కోసం విద్య, వైద్య, రవాణా వంటి సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ పాంతాల్లోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పోలీసులు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహకరిస్తూ వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.