విద్యార్థినులను తరలించే విధానం ఇదేనా?
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 4)
మనుషులు ప్రయాణించే వాహనాలు వేరే… వస్తువులు, సామగ్రి రవాణా చేసే వాహనాలు వేరేగా ఉంటాయి… కానీ ఇక్కడ గిరిజన సంక్షేమశాఖ అధికారుల దృష్టిలో మాత్రం రెండూ ఒకటే రకంగా ఉన్నాయేమో మరి… మంగళవారం బూర్గంపాడులోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల వ్యవహారం చూస్తే అలానే ఉంది. బూర్గంపాడు మండలం ఉప్పుసాకలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం భద్రాచలం ఐటీడీఏ అధికారులు ‘కెరీర్ గైడెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల కేంద్రమైన బూర్గంపాడు నుంచి దాదాపు 75మంది విద్యార్థినులను తరలించే విషయంలో ఉపాధ్యాయులు ప్రమాదకర పద్ధతి అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. వస్తువులు, సామగ్రి రవాణా చేసేందుకు వినియోగించే ఓ బొలెరో వాహనంలో విద్యార్థినులందరినీ ఎక్కించారు. చోటు సరిపోకపోవడంతో కొందరిని అత్యంత ప్రమాదకరమైన ముందుభాగంలో టాప్ పైన అమర్చిన ‘జాలీ’లో ఎక్కించారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితులను ‘దివిటీ మీడియా’ చిత్రీకరించడంతో ‘టాప్’ పైన ఎక్కించిన విద్యార్థినులను కిందకు దించి మరో వాహనం రప్పించి ఉప్పుసాక స్కూల్ కార్యక్రమానికి తరలించారు. కాస్త పొదుపు చేసేందుకు విద్యార్థినులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఆ దుస్థితి వెలుగులోకి తెచ్చేందుకు ‘దివిటీ మీడియా’ చేసిన ప్రయత్నంతో పాఠశాల ఉపాధ్యాయులు తమ తప్పును సరిచేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నీ తెలిసిన ఉపాధ్యాయులే వితండవాదం వినిపించడం గమనార్హం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. జరిగిన సంఘటనను ‘దివిటీ మీడియా’ ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ మణెమ్మ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్వం చేయగా ఆమె స్పందించలేదు. ఏటీడీఓ అశోక్ దృష్టికి తీసుకెళ్లగా, మరోసారి ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.