గంజాయి తరలిస్తూ పట్టుబడిన ‘ప్రెస్ క్లబ్’ అధ్యక్షుడు

భద్రాచలంలో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో సంచలనం
✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 30)
భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం (30 జనవరి) గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర జరిపిన వాహనతనిఖీల్లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు, అతని సోదరుడు పండగ వెంకటేశ్వర్లు, మరో వ్యక్తితో కలిసి కారులో తరలిస్తున్న గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి…
భద్రాచలం ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేకమంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటివారి గురించి ఆ సంఘటనల గురించి పత్రికలలో రాసి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన గురుతర బాధ్యత పాత్రికేయులది. అలా బాధ్యత నిర్వహించాల్సిన పాత్రికేయులే గంజాయి తరలిస్తూ, పట్టుబడటం తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ అధికారులు స్థానిక బ్రిడ్జి చెక్ పోస్ట్ వాహనాలు తనీఖీలు చేసే సమయంలో వచ్చిన హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా(నంబర్: AP37 BU 5216) కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఉన్న 81.950 కిలోల ఎండు గంజాయి వారికి లభ్యమైంది. ఆ గంజాయి తరలిస్తున్న ఆ
కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించిన నార్కోటిక్స్ అధికారులు వారి వివరాలు రాబట్టారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు (సూర్య పత్రిక విలేకరి) పట్టుబడ్డాడు. అతని తమ్ముడు మరో విలేకరి పండగ వెంకటేశ్వర్లు (తెలంగాణ కేసరి పత్రిక), ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట తాలూకా మర్లగూడ గ్రామానికి చెందిన మడవి నంద కూడా పట్టుబడ్డారు. కారు, గంజాయితో సహా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటితోపాటు నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించి వివరాలు ప్రకటించారు. ఈ సంఘటనలో పట్టుబడిన 81.950కిలోల గంజాయి విలువ రూ.20.25 లక్షలుగా నార్కోటిక్స్ అధికారులు ప్రకటించారు. పోలీసుల విచారణలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

