సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
ఆదివారం నారాయణపురం వచ్చి తనను కలవాలని సిబ్బందికి ఆదేశాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 11)
పాల్వంచలోని సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణపై రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పాల్వంచ పర్యటనకు వచ్చిన ఆయన, సాయంత్రం కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆ గెస్ట్ హౌస్ కు వచ్చారు. అక్కడ సిబ్బంది చేసిన ఏర్పాట్లు చూసిన మంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గదులు శుభ్రంగా లేకపోవడం, నిర్వహణలోపం ఉండటంతో సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవురోజైనా ఆదివారం ఉదయం కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని తన నివాసానికొచ్చి కలవాలని ఆదేశించారు. సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది అందరూ రికార్డ్స్ తీసుకుని రావాలంటూ మంత్రి ఆదేశించారు.