ముక్కోటి మహోత్సవాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 8)
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9, 10వ తేదీల్లో జరగనున్న తెప్పోత్సవం, ఉత్తర (వైకుంఠ) ద్వారదర్శనంలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు.బుధవారం ఈ మేరకు భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్సుహాలులో సెక్టార్ల వారీగా విధులు కేటాయించబడిన అధికారులతో సమావేశంలో పలు సూచనలు చేశారు. అత్యంత వైభవంగా జరగనున్న రాముల వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం ప్రదేశాల్లో విధుల్లో పాల్గొన్న అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా, ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 1300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ కు ఏర్పాట్లు, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు భద్రాచలంలో జరిగే ఉత్సవాలకు పోలీసులు సందర్భానుసారంగా విధించే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.