ఇందిరమ్మ మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేసిన పాయం
✍️ మణుగూరు – దివిటీ (జనవరి 8)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించాలని సంకల్పంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది పేదలకు ఇళ్లు అందించాలని దృఢసంకల్పంతో సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో తన కోటాలో 3500 ఇళ్లు ఇచ్చారని, అవి సరిపోవని చెప్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో 1000 ఇళ్లు కూడా నియోజకవర్గానికి కేటాయిస్తానన్నారని వెల్లడించార. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందేవిధంగా కృషిచేస్తామని, ప్రజలెవరూ కూడా దళారులను నమ్మి మోసపోకూడదని, అలా ఎవరైనా చేస్తే తన దృష్టికి తేవాలని కోరారు. మండల పరిధిలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2.5లక్షలు చెక్కులుగా పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసురావు, మున్సిపల్, రెవిన్యూ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.