రామవరం ప్రభుత్వోన్నత పాఠశాలకు అవార్డు
✍️ కొత్తగూడెం – దివిటీ (జనవరి 8)
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ పనితీరు సూచీ ఆధారంగా ఓ ప్రైవేటు సంస్థ ఎంపికలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంపికైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధన, విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాల నిర్వహణ, క్రమశిక్షణ, 180 మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ, మధ్యాహ్నభోజన పథకం అమలు, పేదవిద్యార్థుల దత్తత, వారి విద్యావసరాలు తీర్చడం, ప్రభుత్వ నియమాలు, అధికారుల ఆదేశాలను ఆచరించడం లాంటి కార్యక్రమాలతో ఈ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాదులో ఓ ప్రైవేట్ సంస్థ, తమ అవార్డును పాఠశాల హెచ్ఎం ప్రభుదయాల్ కు ప్రదానం చేసింది. ప్రభుత్వపాఠశాల రాష్ట్రస్థాయి గుర్తింపు సాధించడం పట్ల బుధవారం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వరచారి, హెచ్ఎం ప్రభుదయాల్ ను అభినందించారు.