సింగరేణి సీఎస్సార్ నిధులతో పాఠశాలలకు ఫర్నిచర్


ఫర్నిచర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం
✍️ మణుగూరు – దివిటీ (జనవరి 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా, పరిసర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సింగరేణి సంస్థ సీఎస్సార్ నిధులతో శుక్రవారం ఫర్నిచర్ పంపిణీ చేశారు. స్థానిక సింగరేణి జీఎం ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులకు లాంఛనంగా ఫర్నిచర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సింగరేణి జీఎం రామచందర్, సిబ్బందితోపాటు,సింగరేణి ఐఎన్టీయూసీ మణుగూరు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, జనరల్ సెక్రెటరీ గట్టయ్య, తదితర నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరులో సింగరేణి ఏర్పడి 50సంవత్సరాలు పూర్తి చేసుకుందని, గతంలో మణుగూరులో 50 ఇళ్లు మాత్రమే ఉండి, ఎటుచూసినా గడ్డి గుడిసెలు ఉండేవని, సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత దినదినంగా అభివృద్ధి చెందిందన్నారు. సింగరేణి సంస్థ వలన హెవీవాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, బీపీఎల్ లాంటి అనేక సంస్థలు ఏర్పడ్డాయని, కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి కలుగుతోందని తెలిపారు. సింగరేణి సీఎస్సార్ నిధులు తొలివిడత, రెండోవిడత పూర్తిచేసుకున్నామని, మూడో విడతలో నిరుద్యోగులకు గ్రూప్- 1, గ్రూప్-2 వంటి కోచింగ్ సెంటర్స్, సింగరేణి సంస్థ నడిపించాలన్నారు. అదే విధంగా మణుగూరు గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. మణుగూరు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం సింగరేణి సంస్థ కృషి అభినందనీయమన్నారు. మణుగూరు ఓసీ విస్తరణకు గ్రామస్తులతో మాట్లాడి, ప్రజలకు సరైన న్యాయం చేసేవిధంగా సింగరేణి సంస్థ కృషిచేయాలని, గ్రామ ప్రజలు కూడా సంస్థకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రభావితప్రాంతాల్లో సంస్థ ద్వారా కంటి ఆపరేషన్లు చేయించుకున్న వృద్ధులకు కళ్ళజోళ్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో మణుగూరు సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, తహసిల్దార్ రాఘవ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసురావు, ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఏఐటీయూసీ నాయకుడు (గుర్తింపుసంఘం) రాంగోపాల్ రావు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, సింగరేణి అధికారులు, మండల కాంగ్రెస్ మండల నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు