వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు
ఆగ్రహం వ్యక్తంచేసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

✍️ నరసరావుపేట – దివిటీ (నవంబరు 18)
రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, భవనం రాఘవరెడ్డిలతో కలిసి సోమవారం నరసరావుపేట సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే మీరు చూపించిన దారిలోనే నడుస్తాం అంటూ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఒకే కేసుపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు పెట్టించి, అరెస్టులు చేస్తూ చిత్రహింసలు పెట్టి జైళ్లకు తరలిస్తున్నారన్నారు, రాష్ట్రంలో ఎక్కడా రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని, కేవలం లోకేష్ రాజ్యాంగమే నడుస్తోందన్నారు.
సత్తెనపల్లికి చెందిన పాలూరి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తపై గతంలో 16 నెలల క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై నూజివీడులో ఒకటి, నకరికల్లులో మరొక కేసు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా సుధారాణిపై శ్రీకాకుళంలో ఒక కేసు, తిరిగి నరసరావుపేటలో మరొక కేసు పెట్టారని, మళ్లీ ఈరోజు చీరాల తీసుకెళ్తున్నారని, ఇంకా నాలుగు పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపెట్టడానికి ఒకే కంప్లైంట్ తో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తిరిగి తాము అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చూపించిన దారినే మేము కూడా ఎంచుకుంటామని హెచ్చరించారు. తాము కూడా ఎవరినీ వదిలిపెట్టబోమని, గతంలో మీరు పెట్టిన పాత సోషల్ మీడియా పోస్టులన్నీ వెలికి తీసి కేసులు పెట్టించే కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు పట్టించుకోకుండా కేవలం సోషల్ మీడియా పోస్టులపైనే గురిపెట్టడం మంచిది కాదని, గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన తల్లి, భార్య పైన కూడా పోస్టులు పెట్టారని, తాము ఎప్పుడూ ఎవరి మీద కేసులు పెట్టలేదని తెలిపారు. ధైర్యం ఉంటే మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపైన, వాళ్లు ఏ పార్టీకి చెందిన వారైనా కేసులు పెట్టాలని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి
చిరుమామిళ్ల గ్రామంలో సింగారెడ్డి కోటిరెడ్డిని అరెస్టు చేశారని, కేవలం మూడు సెంట్ల ప్రభుత్వ భూమిని సత్యసాయిబాబా ట్రస్టుకు రిజిస్టర్ చేశాడని, ఆయన ఈ సందర్భంగా ఎంపీడీఓపై దాడి చేశాడని తప్పుడు ఆరోపణలతో ఎస్సీ, ఎస్టీ కేసును ఆయనపై పెట్టారని తెలిపారు. మూడు సెంట్ల స్థలంలో మూడు షాపులు నిర్మించి, అద్దె డబ్బులతో సత్యసాయిబాబా గుడికి సంబంధించి మెయింటెనెన్స్ కు ఖర్చు పెడుతున్నారని, ఆయన ఎక్కడా ఎంపీడీఓను దూషించలేదన్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, దీనిపై వైసీపీ శ్రేణులు పోరాటం చేయాలని, సోషల్ మీడియా కార్యకర్తలందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పక అండగా ఉంటుందని తెలిపారు. వేధింపులు, కేసులన్నీ తాత్కాలికమేనని, త్వరలో పరిస్థితులన్నీ చక్కబడతాయని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులపై హైకోర్టును ఇప్పటికే ఆశ్రయించిందని వెల్లడించారు. విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టులో కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరూ అధైర్యపడవద్దని ఊ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడారు. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ నాయకులు జడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, యన్నం రాధాకృష్ణారెడ్డి, గంటనపాటి గాబ్రియల్, వెంకటప్పరెడ్డి, గుండాల వెంకటేష్, భూదాల కళ్యాణ్, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.