విద్యుత్ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విద్యుత్ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని టీజీఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఫీల్డ్ లోని విద్యుత్ సిబ్బంది ఎర్త్ డిశ్చార్జ్ రాడ్లు, సేఫ్టిబెల్డులు, హెల్మెట్లు, ఇండక్షన్ టెస్టర్ తప్పనిసరిగా ఉపయోగించేలా ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి రహిత విద్యుత్ సంస్థగా ఉంచాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ అధికారులతో స్థానిక సింగరేణి గెస్ట్ హౌజ్ లో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఇవ్వడానికి కృషి చేయాలని, ట్రాన్స్ ఫార్మర్ల ఫెయిల్యూర్స్ తగ్గించాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న కొత్త వ్యవసాయ మోటార్ల విద్యుత్ కనెక్షన్లకు పనులు పూర్తి చేసి త్వరగా సర్వీసులు ఇవ్వాలని ఆదేశించారు. విధులలో భాగంగా విద్యుత్ సిబ్బంది లైన్లు, ట్రాన్స్-ఫార్మర్ల మరమ్మత్తులు చేయడం ద్వారా అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని తెలిపారు. విద్యుత్ బిల్లులను, వినియోగదారులు సకాలంలో పెండింగ్ లేకుండా చెల్లించేలాగా వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. కాలిపోయిన, ఆగిపోయిన మీటర్లను సకాలంలో మార్చాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖ “పొలం-బాట” కార్యక్రమం విస్తృతంగా చేపట్టి, రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు. విద్యుత్ బిల్లులను వినియోగదారులు ఆన్-లైన్ లో చెల్లించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మధుసూదన్, అశోక్, సదర్ లాల్, తిరుపతి రెడ్డి, మల్లిఖార్జున్, నాగప్రసాద్, మాధవరావు, జి.మహేందర్, అనిల్ కుమార్, జిల్లా పరిధిలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.