సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 10)
కలెక్టర్ రోడ్డుపక్కన కూర్చుని వివరాలు రాసుకుంటున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది… అసలు ఆయన కలెక్టరేనా? కాదా? అని చూసినవాళ్లు అనుమానంలో పడ్డారు… సెలవురోజైన ఆదివారం పాల్వంచ పట్టణం పరిధిలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో కనిపించిన ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యపడేలా చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో కనిపించింది దృశ్యమిది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జి.వి.పాటిల్ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా సర్వే పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఎన్యుమరేటర్లను ఆదేశించారు. ఈ సర్వేలో వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? అని ఆయన ఆరా తీశారు. ఏవైనా ఇబ్బందులుంటే సూపర్ వైజర్లు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈనెల 6నుంచి 8వ తేదీ వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ పూర్తి చేశామని, శనివారం నుంచి ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కులం వివరాలు సేకరించి నమోదు చేస్తున్నామన్నారు. సర్వే ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వివరాలు పొందుపరచాలన్నారు. దాదాపు 57కు పైగా అంశాల్లో వివరాలు నమోదు చేయవలసి ఉన్నందున ఎన్యుమరేటర్లకు ఒక సహాయకులను నియమించుకుంటే బాగుంటుందని సూచించారు. ప్రతి బ్లాకుకు ఒక ప్రత్యేక ఎన్యుమరేటర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లంతా క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నమోదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచి, ఆ వివరాలను ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన కేంద్రాల్లో డేటా ఎంట్రీ సిబ్బందితో ఎటువంటి పొరపాటు లేకుండా ఆన్లైన్లో నిర్దిష్ట సమయంలోనే తప్పక నమోదు చేయించాలన్నారు. సర్వే వలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించేలా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆధార్, రేషన్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద సిద్ధంగా ఉంచుకుని సర్వే ఎన్యుమరేటర్లకు అందించి నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.