చదువు, సామాజిక బాధ్యతతో ముందుకెళ్లాలి: సీఎం రేవంత్ రెడ్డి
✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 4)
విద్యార్థినీ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణిస్తూ, సామాజిక బాధ్యతతో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తోందని చెప్తూ, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాల నుంచి విద్యార్థులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో తరలివచ్చి సీఎంను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో ముఖాముఖి మాట్లాడిన సీఎం వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి పలు విషయాలను తెలియజేశారు.
డ్రాపవుట్స్ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడవద్దని కోరారు. రాజకీయపార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, విద్యార్థులు, నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్దం కావాలని సీఎం ఈ సందర్భంగా హితవు పలికారు.