ప్రధాన రహదారిని బాగు చేయించండి
కలెక్టర్ కు సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి
✍️ మణుగూరు – దివిటీ (నవంబరు 4)
మణుగూరు ఏటునాగారం ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు గుర్తించి రహదారిని బాగు చేయించాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి సోమవారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ కు విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రహదారి అధ్వానంగా ఉన్నా, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఈ రహదారిని పునరుద్ధరించ లేదని, మరమత్తులు చేపట్ట
లేదని, ఆయన విమర్శించారు. ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తే అధికారం చేపట్టిన తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజానీకానికి గుంతలరోడ్లు బహుమానం ఇచ్చిందని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు ? ప్రజల గోడు పట్టదా? ప్రజల జీవన పరిస్థితి పట్టదా ? ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. మణుగూరు నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు ప్రధాన రహదారి పెద్ద గోతులతో దర్శనమిస్తుందని, ప్రజలు వెళ్లాలన్న తిరిగి మణుగూరు కి రావాలన్నా అనేక అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మంత్రి జోక్యం చేసుకుని ప్రభుత్వం నుంచి రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలా చేపట్టకపోతే రాబోయే కాలంలో రహదారులు దిగ్బంధనం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.