బీసీ రిజర్వేషన్లకు చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కులగణన అంశాలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
✍️ హైదరాబాదు – దివిటీ (నవంబరు 3)
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టుతీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించి రేపటిలోగా ఉత్తర్వులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.