రాబోయే పదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే…

స్మార్ట్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రామాణికం
కులగణనతోనే రాజకీయ ఉద్యోగ విద్య రిజర్వేషన్లు సాధ్యం
ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ విద్యాలయం
ప్రతి ఎస్టీ నియోజకవర్గంలో 15వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాo
✍️ ఇల్లందు – దివిటీ (నవంబరు 3)
రాబోయే పదేళ్ల కాలంలో తెలంగాణలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షతన నిర్వహించిన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, చేసిన అప్పులకు ఎగనామం పెట్టారన్నారు. అవన్నీ సరి చేసుకుంటూ, గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు 6గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలా ముందుకు సాగుతుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని ఆరోపణలు, అవమానాలు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీమేరకు అన్ని సంక్షేమపథకాలను వచ్చే నాలుగేళ్లలో అందజేసి, మరో 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేవిధంగా పాలన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఒకే ఒక ప్రామాణికకార్డుతో రేషన్, ఇందిర ఇళ్లు, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పొందేందుకు స్మార్ట్ కార్డు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాలను ఎంపికచేసి అమలు చేస్తున్నామన్నారు. ఈ స్మార్ట్ కార్డు ద్వారానే అన్నిరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొంద వచ్చన్నారు. ప్రతి పేదవాడి కుటుంబంలోని పిల్లలంతా కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించేందుకు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ రూ.150 కోట్ల వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ విద్యాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో ఇల్లందు నియోజకవర్గంలో సైతం ఈ పాఠశాల నిర్మాణానికి కృషి చేయనున్నామన్నారు. త్వరలో పేదవాడి సొతింటికల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3500 మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇల్లందు, పినపాక, భద్రాచలం, కారేపల్లి నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలైనందు వల్ల వెసులుబాటును బట్టి 5000 కాకుండా 15 వేల ఇళ్ల చొప్పున ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు ఛేసేలా కృషిచేస్తానన్నారు. వచ్చే నాలుగేళ్ల కాలంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించి, బడ్జెట్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇళ్లనేలాగా గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ముద్రవేశారన్నారు. ఎన్నికల సమయంలో భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీమేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టామని, కుల గణన ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అధికారం కోల్పోయి రైతు రుణమాఫీపై తప్పుడు ఆరోపణచేస్తున్న, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టుగా, ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని, మరో రూ.13వేలకోట్ల రుణమాఫీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రాబోయే రెండు నెలల్లో రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతాంగానికి కేటాయించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి 72 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించిన ఘనత తెలంగాణకు దక్కుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో కొనసాగేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దీనిని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య తెల్ల వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు గోపాల్ రెడ్డి, మువ్వ విజయబాబు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంపీపీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.