సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 14)
సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న ‘సైబర్ క్రైమ్స్’ పట్ల అవగాహనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. స్థానిక చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంపై ఏర్పాటు చేసిన ‘జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్’ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన వారికి ఈ సెంటర్ ద్వారా అండగా ఉండి, బాధితులు కోల్పోయిన నగదును తిరిగి వారు పొందే విధంగా సహాయం చేయడంలో తోడ్పడుతుందని తెలిపారు. సైబర్ నేరాల బారినపడిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పున 28మంది ‘సైబర్ వారియర్స్’ను కూడా కేటాయించినట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో అమాయక ప్రజల డబ్బును వారి వారి అకౌంట్ల నుంచి కాజేస్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కారానికి ఈ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ కృషి చేస్తుందని ఎస్పీ వివరించారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా వారిని అప్రమత్తంగా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. సైబర్ నేరాల బారినపడి నగదు కోల్పోయినవారెవరైనా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ద్వారా బాధితులు తమ నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ నేరానికి గురైనట్లు ఎంత త్వరగా గ్రహించి ఫిర్యాదు చేయగలిగితే (గోల్డెన్ అవర్) అంత త్వరగా కోల్పోయిన నగదును కాపాడుకోవచ్చని ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారినపడిన బాధితుల నుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు 265 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రూ.2,61,62,175 (రెండు కోట్ల అరవై ఒక్క లక్షల అరవై రెండువేల నూట డెబ్భై ఐదు రూపాయలు)ను సైబర్ నేరగాళ్ళ అకౌంట్ల నుంచి తిరిగి బాధితులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అధికారులు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్, 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.