బాధ్యతలు చేపట్టిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఖమ్మం నూతన ఈఈ


శుభాకాంక్షలు తెలిపిన పలువురు సిబ్బంది, మిత్రులు
✍️ హైదరాబాదు – దివిటీ (ఆగస్టు 16)
‘తెలంగాణ విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యుఐడీసీ)’ ఖమ్మం కార్య నిర్వాహక ఇంజినీర్(ఈఈ) గా పి.విన్సెంట్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దాదాపు నెలరోజులకు పైగా కార్యకలాపాలు స్తంభించి పోయిన కార్యాలయానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. అధికారి అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించక పోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను “దివిటీ మీడియా” వెలుగులోకి తీసుకురావడంతో ఆ సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించారు. టీజీఈడబ్ల్యుఐడీసీ ఖమ్మం డివిజన్ ఈఈ గా, డీఈ పి.విన్సెంట్ రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ సంస్థ ఎండీ ఇ.నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సంస్థ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ లో డీఈగా పనిచేస్తున్న విన్సెంట్ రావును ఖమ్మం డీఈగా బదిలీచేస్తూ, ఈఈ పోస్టులో కూడా పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ)లు చేపట్టాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మేరకు విన్సెంట్ రావు, శుక్రవారం ఖమ్మంలో ఆ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏఈలు సత్యశ్రీనివాస్, దుర్గాశ్రీనివాస్, రాంకుమార్, యూసఫ్ అలీ, ఖమ్మం జిల్లాకు చెందిన ఏఈలు సురేష్, వంశీ, బాజీ, గంగాప్రసాద్, హెచ్.డి సాంబశివరావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, డీపీఓలు రాంబాబు, కృష్ణవేణి, రమేష్, కాంట్రాక్టర్లు కిరణ్ కుమార్, వడ్డే నాగేశ్వరరావు, మోహన్ రావు, రత్నం, తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.