మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి








✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 9)
తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం కోసం మహిళలకు రుణాలందించి పలురకాల ఆదాయాబివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ద్వారా గ్రూప్ యాక్టివిటీ కింద రూ.6లక్షల బ్యాంకు రుణసహాయంతో ఏర్పాటుచేసిన “ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్”ను శుక్రవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళా సాదికారత సాధించేందుకు వచ్చే 5సంవత్సరాల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మహిళలు అన్నిరకాలుగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో తోడ్పాటునందిస్తామన్నారు. కొత్తగూడెం పట్టణంలో మొత్తం 5 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే కలెక్టరేట్ ఆవరణలో మొదటి క్యాంటీన్ ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండేప్రాంతాల్లో పలు రకాల ఆహారపదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళాశక్తి క్యాంటీన్లలో ఆహారం అమ్మచేతి వంటలా ఉండాలని, నాణ్యతకు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మంత్రి పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ కాలనీలో దాదాపు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే సైడ్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామన్నారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్.హించిన బైక్ ర్యాలీతో లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బీట్ లో స్వచ్ఛదనం – పచ్చదనం ముగింపులో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వనమహోత్సవ లక్ష్యాలు అందరూ సాధించాలని కోరారు. పోడు వ్యవసాయం కొత్తగా ఎవరూ చేపట్టవద్దని, చేపట్టినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు అటవీశాఖాధికారులు జామాయిల్ పెంపకం, తదితర పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోడువ్యవసాయం చేస్తున్న గిరిజనులతో స్నేహభావంతో ఉండాలని అన్నారు. గత సంవత్సరం వలస గిరిజనుల దాడిలో మరణించిన రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 500 గజాల ఇంటిస్థలం పట్టాను రెవెన్యూ మంత్రిగా త్వరలోనే అందజేస్తామని తెలిపారు. పాల్వంచ మండలంలో దాదాపు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలసి సరదాగా టెన్నిస్ ఆడారు. ‘ఖేలో ఇండియా’ లో భాగంగా నిర్వహిస్తున్న ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని మంత్రి సందర్శించి, క్రీడాకారులతో మాట్లాడారు. పర్యటనలో మంత్రితోపాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా క్రీడాశాఖాధికారి పరంధామరెడ్డి, పలువురు జిల్లా అధికారులు, అటవీ శాఖాధికారులు, మెప్మా డీఎంసీ రాజేష్, మహిళా సంఘ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.