పోలీసుల వద్ద లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 8)
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల వద్ద ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడి చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి…
తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ శబరి ఏరియా సబ్యుడు చర్ల మండలం కిష్టారంపాడుకు చెందిన వెట్టి లక్ష్మయ్య అలియాస్ కల్లు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ గొల్లపల్లి ఎల్ఓఎస్ సభ్యుడు సుక్మా జిల్లా, గొల్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన మల్లం దేవ పోలీసులు, సీఆర్పీఎఫ్ 141, 81 బెటాలియన్ల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగి పోయినట్లు ప్రకటించారు.
వెట్టి లక్ష్మయ్య అలియాస్ కల్లు 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీకి చెందిన వెట్టి దేవ అలియాస్ బాలు అనే చర్ల-శబరి ఏరియా మిలీషియా కమాందర్ దగ్గర మిలీషియా సభ్యుడిగా చేరినట్లు వెల్లడించారు. అతను మిలీషియా సభ్యుడిగా ఉంటూ మావోయిస్టు పార్టీకి నిత్యావసర వస్తువుల సరఫరా, పార్టీ ఆదేశించిన ఇతర పనులు చేస్తూ పార్టీలో సభ్యుడిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. 2022 అక్టోబర్ నెలలో దళసభ్యుడిగా ప్రమోషన్ పొంది, కొన్నిరోజులు భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యుడు ఆజాద్ కు గార్డ్ గా పని చేసినట్లు తెలిపారు. తర్వాత కొన్నిరోజులు చర్ల ప్లటూన్ లో దళసభ్యుడిగా కొనసాగి, 2023లో శబరి ఏరియాకి బదిలీ అయ్యి ఇప్పటివరకు శబరి ఏరియా దళసభ్యుడిగా పనిచేసాడని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.
మల్లం దేవ 2007 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీకి చెందిన బాలలసంఘంలో పనిచేశాడని, 2015 లో మడకం ఉంగల్ అలియాస్ ఎర్రాల్ అనే గొల్లపల్లి ఎల్ఓఎస్ మిలీషియా కమాండర్ దగ్గర సభ్యుడిగా చేరాడని పేర్కొన్నారు. 2017లో మిలీషియా కమాండర్ గా, 2020లో దళసభ్యుడిగా ప్రమోషన్లు పొంది ఇప్పటివరకు గొల్లపల్లి ఎల్ఓఎస్ దళసభ్యుడిగా పనిచేసాడని వివరించారు. గొల్లపల్లి ఎల్ఓఎస్ కమాండర్ ఎర్ర దాదా మరణాంతరం, ఇతను ఇంచార్జి గా పనిచేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు భరించలేక చాలామంది సభ్యులు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ద్వారా కౌన్సిలింగ్ కు హాజరైన కుటుంబసభ్యులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తమవారిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా వీరిద్దరు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.