పోలీసులమంటూ బెదిరించి డబ్బుల కోసం దాడి
నలుగురిని అరెస్టు చేసిన కొత్తగూడెం 2టౌన్ పోలీసులు
✍️ కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 7)
నేషనల్ హైవే పక్కన రీల్స్ షూటింగ్ చేసుకుంటున్న విద్యార్థులను పోలీసుల డబ్బుల కోసం బెదిరించిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం 2టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కొత్తగూడెం 2టౌన్ సీఐ రమేష్ మీడియాకు ఆ కేసు వివరాలు వెల్లడించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం… కొత్తగూడెంనకు చెందిన విద్యార్థులు ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజు ఈనెల 4న సాయంత్రం సమయంలో రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ జంక్షన్ దగ్గరలోని నేషనల్ హైవే వద్ద రీల్స్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో వారిని చూసిన పెనగడపకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వస్తూ తాము పోలీసులమంటూ చెప్పి వారిని బెదిరించారు. ఇక్కడెందుకు ఫోటోలు దిగుతున్నారంటూ ప్రశ్నిస్తూనే మీరు గంజాయి బ్యాచ్ అంటూ వారి ఫోటోలు తీశారు. పోలీసులమంటూ బెదిరించి, వారిని డబ్బుల గురించి భయపెట్టారు. వారిని బెదిరిస్తూ, తీసిన ఆ ఫోటోలను డిలీట్ చేయడానికి డబ్బులివ్వాలని అడిగారు. వారిని ఐడీ కార్డు చూపించాలని ఆ విద్యార్థులు అడగడంతో, కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మమ్మల్నే ఐడీ కార్డు అడుగుతారా? అంటూ వారిని కొట్టారు. తమపై ఆగంతకులు దాడి చేస్తుండగానే ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై వారు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తమ దర్యాప్తులో నిందితులైన ఆ నలుగురు పెనగడపకు చెందిన ఎస్కే యాకూబ్ గౌరీ, ఎగ్గడి అశోక్, వడ్డే మనోజ్, పులిచర్ల శరత్ చంద్ర లుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి కారు, ఫొటోలు తీసిన సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు గానీ ఇతర వ్యక్తులు గానీ నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి ఫోటోషూట్స్, రీల్స్ లాంటివి తీసుకోవడం చేయవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ఎవరూ కూడా రోడ్లమీద, నిర్మాణంలో ఉన్న ప్రదేశాలతోపాటు, ప్రమాదకరమైన వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లి ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేయవద్దని ఆయన కోరారు.