బూర్గంపాడులో పోలీసుల భారీవిజయం
రూ.62లక్షల విలువైన గంజాయి పట్టివేత
అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 2)
నిషేధిత గంజాయి నిరోధంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్ పర్యవేక్షణలో శుక్రవారం బూర్గంపాడు పోలీసులు భారీ విజయం సాధించారు. బూర్గంపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని సారపాక గ్రామ శివారులో ఏకంగా రూ.62లక్షల విలువైన నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. ఈ భారీవిజయంలో పాలు పంచుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్, సీసిఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సైలు రాజేష్, ప్రవీణ్, సుమన్, సిబ్బంది సమక్షంలో మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం… బూర్గంపాడు ఎస్సై ఇ.రాజేష్, తన స్టేషన్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు జె.ప్రవీణ్, సుమన్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయిని పట్టుకునేందుకు సారపాక గ్రామ శివారులో పల్లెప్రకృతి వనం వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ ఇన్నోవాకారు (రిజిస్ట్రేషన్ నెంబర్ AP26BR7003), మరో టాటాజెస్ట్ కారు (రిజిస్ట్రేషన్ నెంబర్ TS04EC9740), ఇంకొక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు (రిజిస్ట్రేషన్ నెంబర్ TS2808305) భద్రాచలం వైపు నుంచి మణుగూరు క్రాస్ రోడ్ వైపునకు వస్తున్నాయి. ఆ సమయంలో పోలీసులను చూసి ఆ కార్లలోనివారు ఒక్కసారిగా వాటిని వెనుకకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అనుమానాస్పదంగా కనబడటంతో ఆ కార్లను పోలీసులు ఆపి పట్టుకుని తనిఖీ చేయగా, రెండు కార్ల లోపల వెనుక డిక్కీలో బ్రౌన్ కలర్ టేపుతో చుట్టి ఉన్న నిషేదిత గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వెంటనే ఆ కార్లలోని ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని విచారించి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 247.285కిలోల గంజాయి (విలువ సుమారుగా రూ. 61, 82,125), కార్లు -3 (ఇన్నోవా- AP26BR7003), (టాటా జెస్ట్ -TS04EC9740), (మారుతి డిజైర్ -TS28J8305), సెల్ ఫోన్లు-7, నగదు -రూ.8300 ఉన్నాయని వివరించారు.
***********
ఈ కేసులో పట్టుబడిన వారి వివరాలు…
***********
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంబేద్కర్ కోనసీమ (పూర్వ తూర్పు గోదావరి) జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కాద తనోజ్ హర్షిత్ S/O గోవిందరాజు.
- హైదరాబాద్ గంగబోడి, మంగలహాట్ ప్రాంతానికి చెందిన కిషన్ కుమార్ దాస్ S/O ఉపేందర్ దాస్.
- జనగాం జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామానికి చెందిన భూక్యా దేవేందర్ S/Oమాల్య.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గాంధీనగర్ కాలనీకి చెందిన రావులపల్లి ప్రతాప్ S/O రత్తయ్య.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక తాళ్లగొమ్మూరు ప్రాంతానికి చెందిన ములగాడ అన్వేష్ S/O శ్రీనివాస రావు.
- హైదరాబాదు బంజారాహిల్స్, రోడ్ నెంబర్ -12కు చెందిన బావికాడి శ్రీనివాస్ S/O అనంతరాములు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా
———-
మూడు కార్లతో అక్రమంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నిందితుల ముఠా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని చింతూరు, డొంకరాయి, సీలేరు ప్రాంతాల్లో గంజాయిని సేకరిస్తూ, హైదరాబాద్ సహా దేశంలో వివిధ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో అమ్ముతూ, అక్రమార్జనకు పాల్పడుతున్నారని పోలీసు విచారణలో తెలిసింది. ప్రస్తుతం పట్టుబడిన కార్లలోని మారుతీ డిజైర్ కారు, ముందు వచ్చే ‘పైలట్ వెహికల్’ గా ఉపయోగిస్తున్న ఈ ముఠాసభ్యులు, మరో రెండు కార్లలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వీరితో కలసి గంజాయి వ్యాపారం చేసే ప్రధాన నిందితుడు సారపాక గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి అని విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. ఆ వ్యక్తి సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కిల్లో మోహన్, పోటేరు మోహన్ రావు, రామారావు అనే వ్యక్తుల వద్ద సేకరించి హైదరాబాదులో మహేందర్ సింగ్ అనే వ్యక్తికి ఇవ్వటం కోసం తీసుకెళ్తున్నట్లు విచారణలో తెలిసింది. వీరికి గంజాయి రవాణాకోసం కారును ఏర్పాటు చేసిన జనగామకు చెందిన లతీఫ్ అనే వ్యక్తి కూడా గంజాయి వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ప్రస్తుతం పట్టుబడిన ఆరుగురు వ్యక్తులు, పరారీలో ఉన్న మరో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. ఇట్టి నేరం నందు బాగస్వాములైన ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి, మహేందర్ సింగ్, కిల్లో మోహన్, పోటేరు మోహన్ రావు, రామరావు, లతీఫ్ పరారిలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం
పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డిపై సుమారు 10 గంజాయి కేసులున్నట్లు తేలిందని కూడా వెల్లడించారు. పట్టుబడిన నిందితులలో కిషన్ కుమార్ దాస్ పై రెండు గంజాయి కేసులు, కాద తనోజ్ హర్షిత్, మునగాడ అన్వేష్ పై ఒక్కొక్క గంజాయి కేసు నమోదు కాబడి ఉన్నాయని వివరించారు.
*****************
పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు
బూర్గంపాడు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం దాదాపు రూ.62లక్షల విలువ గల 247 కేజీల నిషేధిత గంజాయిని వాహన తనిఖీల్లో చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సైలు ప్రవీణ్, సుమన్, బూర్గంపాడు ఎస్సై రాజేష్, సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ ప్రత్యేకంగా అభినందించారు. నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే 8712682133, 8712682135 సెల్ నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన అందర్నీ కోరారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడంలో జిల్లా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతతో పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.