రైతు దంపతులను సన్మానించిన కలెక్టర్


సమీకృత వ్యవసాయంతో అభివృద్ధి చెందవచ్చని సూచన
✍️ ములకలపల్లి – దివిటీ (జులై 12)
సమీకృత వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు దంపతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సత్కరించారు. శుక్రవారం జిల్లాకలెక్టర్ ములకలపల్లి మండలంలో పర్యటించిన సందర్భంగా సమీకృత వ్యవసాయం చేస్తున్న చందర్రావు అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అక్కడ రైతు తన పామాయిల్ తోటలో జామ పంట పండిస్తున్నారు. పశు సంరక్షణతో పాటు వాటి పేడతో స్వయంగా ఎరువులు తయారుచేసుకుని తోటలకు ఉపయోగించడం ఆయన తెలుసుకున్నారు. ఆ రైతు పామాయిల్ తోటలో నాటు కోళ్లు, తేనెటీగల పెంపకం చేస్తుండటం పరిశీలించిన జిల్లా కలెక్టర్ చందర్రావు దంపతులను సన్మానించారు. కొత్తూరులో సోయం కృష్ణ అనే రైతు వేసిన మునగ నర్సరీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధిహామీ పథకం ద్వారా మునగ పంట వేస్తున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందుతాయని తెలిపారు. ఆ పథకం ద్వారా పంట చేనులో ఫారం పాండ్లు తీయించుకుని, వాటిలో రైతు చేపల పెంపకం చేసుకుంటే అదనంగా లాభం ఉంటుందని తెలిపారు. రైతులు ఒక పంట మీదనే ఆధారపడకుండా సీజన్ వారీగా పంటలు పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. అదే మండలంలో పాతూరుకు చెందిన ఈదర మురళి అనే రైతు చేపలచెరువుతోపాటు బంతి సాగు చేస్తుండటం పరిశీలించిన కలెక్టర్, రైతులందరూ ఇలా సమీకృత వ్యవసాయం చేస్తూ అధికంగా లాభాలు పొందాలని తెలియజేశారు. ప్రతి గ్రామపంచాయతీలో అజోలా పెంపకం చేపట్టి వరిపంట వేసే రైతులందరికీ ఇస్తామని తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎరువుల వినియోగం తగ్గుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.