Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం సాగాలి

ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం సాగాలి

విద్యాలయాల తనిఖీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్

✍️ ములకలపల్లి – దివిటీ (జులై 12)

ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ విద్యార్థులకు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమాల అమలు పరిశీలనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ ములకలపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను పరిశీలించారు. జూనియర్ కళాశాల పరిసరాలు, ఆవరణ, భవనాన్ని పరిశీలించి, ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు. కళాశాల భవనం, విద్యుదీకరణ పనులు, మంచినీటిసౌకర్యం, తరగతిగదుల ఫ్లోరింగ్, తలుపులు, రంగులు, అన్ని మౌలికలు సదుపాయాల కల్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావును ఆదేశించారు. కళాశాలఆవరణలో వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, విశాలమైన ఆ ఆవరణలో మునగ, చింత, ఉసిరి, వెలగ, కరివేపాకు చెట్లను నాటాలని సూచించారు. ఆవరణలో ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించాలని ఆదేశించారు. అధ్యాపకులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఒకేషనల్ తరగతులలో కావలసిన పరికరాలు అమర్చి తగిన శిక్షణనివ్వాలని ఆదేశించారు. అనంతరం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం పరిశీలించారు. అక్కడ విద్యార్థినులతో మాట్లాడి, వారికందుతున్న ఆహారం, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే ఆహారం అందించాలని ఆదేశించారు. ఎంపీహెచ్ఎస్ తరగతి గదిలో కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ, నర్సింగ్ కోర్సు చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉపాధి దొరుకుతుందని, ఉజ్వల భవిష్యత్తుంటుందని విద్యార్థినులు శ్రద్ధగా విద్యనభ్యసించాలని కలెక్టర్ సూచించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులో రాష్ట్ర స్థాయిలో రెండవస్థానం సాధించిన పి.సౌమ్య అనే విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణ, ములకలపల్లి తహసిల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ భారతి, ఎంఈఓ శ్రీరామ్ మూర్తి, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సక్కుబాయి, కేజీబీవీ అధికారి అన్నామని, తదితరులు పాల్గొన్నారు.

Related posts

“డయల్ యువర్ ఎస్పీ”లో సమస్యలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

ఎన్నాళ్లో ‘వేచిన’ విజయం…

Divitimedia

పాయం రాములమ్మ, పద్మశ్రీ రామచంద్రయ్యలకు మంత్రి తుమ్మల నివాళులు

Divitimedia

Leave a Comment