వైద్యారోగ్య సిబ్బంది పనితీరుపై ఐటీడీఏ పీఓ అసంతృప్తి


పంచాయతీ సెక్రటరీకి నోటీస్ జారీ చేయాలని ఆదేశం
చర్లలో పర్యటించిన ఐటీడీఏ పీఓ రాహుల్
✍️ భద్రాచలం – దివిటీ (జులై 6)
వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత వర్షాకాలం సీజనులో వైద్యారోగ్య సిబ్బంది పనితీరు బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, పని తీరు మెరుగుపర్చాలని డీఎంహెచ్ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన పీఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)కి ఆదేశాలు జారీ చేశారు. శనివారం చర్ల మండలం సత్యనారాయణపురంలో ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. వర్షాకాలంలో ఆవాసప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పంచాయతీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ ఆదేశించారు. మురికినీరు నిలువ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తున్నందున పాత టైర్లు, కూలర్లు, తొట్టెలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పారబోసేలా ప్రజలకు తెలియజేయాలని, వీధుల్లో ఇళ్లలో దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, స్ప్రే చల్లించాలని అన్నారు. ప్రజలు కూడా తమ ఇంటిముందు నీరునిల్వ ఉండే వస్తువులేవీ ఉంచకూడదని, ఆరుబయట నీరు నిల్వ ఉంటే, వెంటనే పంచాయతీ సిబ్బందికి తెలియ జేసి దోమల మందు పిచికారి చేయించాలని, అలాగే కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు. అనంతరం పీఓ కొయ్యూరు ప్రాథమికఆరోగ్యకేంద్రం సందర్శించి అక్కడ రోగులతో సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాధుల సీజనులో వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడం పట్ల డీఎంహెచ్ఓను ఫోన్ ద్వారా సంప్రదించి కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పని తీరు బాగాలేదని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పీఓ ఆదేశించారు. తర్వాత డెంగ్యూవ్యాధి సోకిన పేషంట్ల ఇంటికి వెళ్లి సరైన వైద్యపరీక్షలు చేయించుకుని, క్రమం తప్పకుండా మందులు వాడాలని, ఇంటిబయట, ఇంటి లోపల దోమల మందు పిచికారి చేయించుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి ప్రబలిన గ్రామాల్లో ప్రతి ఇంటికి దోమల మందు పిచికారి చేయాలని, ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసి అందరికీ రక్త పరీక్షలు చేసి, డెంగ్యూ, మలేరియా వ్యాధుల నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక చికిత్సలు చేయాలన్నారు. సంబంధిత జిల్లా వైద్యాధికారి సమస్యత్మక మండలాలు, గ్రామాల్లో తప్పనిసరిగా దోమలమందు పిచికారి, క్లోరినేషన్ కూడా చేయించాలన్నారు. ఈ సందర్భంగా కత్తిగూడెం పాఠశాల సందర్శించిన పీఓ, విద్యార్థులకు బోధిస్తున్న మూల్యాంకనం పరిశీలించారు. పిల్లల చేత అక్షరాలు రాయించి మూడు, నాలుగు, ఐదవ తరగతి పిల్లలకు వారికర్థమయ్యేరీతిలో అక్షరాలు నేర్పించాలని, లెక్కలు చెప్పాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పిల్లల నైపుణ్యాలు పరీక్షించి, వారికి పెన్నులు, నోటుబుక్కులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో చర్ల ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ ఎస్కే వలి, సీడీపీఓ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.