సింగరేణి సీఎండీ బలరామ్ కు ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డు
హైదరాబాద్ లో ప్రదానం చేసిన ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ సంస్థ
✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 30)
సింగరేణి కాలరీస్ సంస్థను పర్యావరణహిత సంస్థగా మార్చడంతోపాటు అందరిలోనూ పర్యావరణస్ఫూర్తిని పెంచేందుకు తానే స్వయంగా 18వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని 6జిల్లాల్లో 35 చిన్న అడవులను (మినీ ఫారెస్ట్స్) సృష్టించినందుకు గుర్తింపుగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ కు గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ సంస్థ “ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ“ అవార్డు ప్రదానం చేసింది. శనివారం రాత్రి హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ -2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ కు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ నిబంధనల ప్రకారం పచ్చదనాన్ని కాపాడడంతోపాటు స్వచ్ఛందంగా కూడా పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సింగరేణివ్యాప్తంగా 6కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ చేస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా 2021-22వ సంవత్సరంలో ‘కార్బన్ న్యూట్రాలిటీ కంపెనీ’గా సీఎంపీడీఐ గుర్తించిందని పేర్కొన్నారు. ప్రతీ అడుగు పచ్చదనం అన్న నినాదంతో మొక్కలునాటే యజ్ఞం కొనసాగిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2వేల మొక్కలునాటాలని తాను వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీంతో 20 వేల మొక్కలు నాటినట్లవుతుందని, కంపెనీలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలల్లో పర్యావరణ సిలబస్ బోధిస్తున్నామని, ప్రతి క్లాసులో ‘గ్రీన్ కెప్టెన్ల’ను నియమించి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తున్నట్లు చెప్పారు. తనకు అవార్డు ప్రకటించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవార్డు సింగరేణిలోని పర్యావరణహితులందరికీ చెందుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పర్యావరణహిత కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు బలరామ్ పేర్కొన్నారు.