భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం



కలకలం రేపిన ‘చోరీకి విఫలయత్నం’ వ్యవహారం
✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 28)
విలువైన దస్త్రాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతరత్రా సామగ్రి ఉండే బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం అభద్రతతో కొనసాగుతోంది. మండలానికి గుండెకాయ లాంటి ఈ కార్యాలయంలో అత్యంత విలువైన పత్రాల భద్రత ప్రమాదంలో పడింది. ఈ కార్యాలయంలో వెనుక వైపు నిర్మించిన ఓ అదనపు గదికి తలుపులు, కిటికీలు శిథిలమైపోవడంతో భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ గదిలో నిల్వ ఉంచిన ఇన్వర్టర్ బ్యాటరీలు, మరికొన్ని పాత కాగితాలను శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసే ప్రయత్నం చేశారు. అదేసమయంలో స్థానికులు కొందరు రావడంతో దొంగలు ఆ సామగ్రిని వదిలేసి పారిపోయారని చెప్తున్నారు. ఈ వ్యవహారం కాసేపటికి వెలుగుచూడటంతో కలకలం సృష్టించింది. అత్యంత పురాతనమైన నిజాం నవాబుల కాలంనాటి బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం ప్రధానభవనం వెనుక భాగంలో కొన్నేళ్ల కిందట అదనంగా మరో గది నిర్మించారు. ఓ జనరేటర్, తదితర అవసరాల కోసం నిర్మించిన ఆ గదిని సిబ్బంది వినియయోగించారు. ఆ గది శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది ఖాళీ చేసి, పాత ఫైళ్లు, పత్రాలు, తదితర సామగ్రి నిల్వ ఉంచారు. పాత కాగితాలు, సామగ్రి కారణంగా ఎలుకలు, కీటకాలతో ఆ గది పూర్తిగా తలుపులు, కిటికీలతో సహా శిథిలావస్థలో ఉంది. ఇక్కడి పరిస్థితులు గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం చోరీకి విఫలయత్నం చేశారు. ఆ గది వెనుక శిథిలమైన తలుపులు తొలగించి లోపలకు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ గదిలోనే ఉన్న పాత బ్యాటరీలను బస్తాలలో వేసుకుని చోరీచేసే యత్నంలో అక్కడే ఉన్న పాతకాగితాలను కూడా వాటిపై వేసుకుని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఆ గదిలో నుంచి కార్యాలయం లోపలకు వచ్చి విలువైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి కూడా ఎత్తుకుపోయేలా పరిస్థితులున్నాయి. దీంతో తహశీల్దారు కార్యాలయం భద్రత ప్రమాదంలో పడింది. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తాత్కాలికంగానైనా పటిష్టమైన కాపలా ఏర్పాటుచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ గదుల గోడలు, తలుపులు, కిటికీలకు కూడా మరమ్మత్తులు చేయించి, భద్రత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈ వ్యవహారంపై ఇన్ఛార్జ్ తహశీల్దారు రాంనరేష్ ను ‘దివిటీ మీడియా’ సంప్రదించగా, చోరీకి విఫలయత్నం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరమ్మత్తుల అవసరాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు.