సాగు చేస్తున్నవారికే రైతు భరోసా అందించాలన్న రైతులు


వీడియో కాన్ఫరెన్సులో మంత్రి తుమ్మలతో రైతులు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 25)
తమ పొలాల్లో పంటలు సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతుభరోసా ద్వారా లబ్ధి చేకూరాలని, రియల్ ఎస్టేట్ భూములకు రైతుభరోసా వర్తింపజేయవద్దని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, రాతపూర్వకంగానూ నివేదించారు. రైతు భరోసా పథకంపై రైతులు అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. మంగళవారం హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్సులో ‘రైతు నేస్తం’ అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఐదు రైతువేదికలలో పాల్గొన్న రైతులతో ఆయన మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు రైతువేదికల్లో లక్ష్మీదేవిపల్లి, కోయగూడెం, ములకలపల్లి, బూర్గంపాడు, చర్లలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి రైతువేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని రైతులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్గొన్న 434 మంది రైతుల్లో పలువురు మాట్లాడుతూ, రైతుభరోసా అమలుపై స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, ఏడీఏలు రమేష్, రవికుమార్, అరుణ్ బాబు, దీపక్ ఆనంద్, సాయినారాయణ, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు పాల్గొన్నారు.