వరదల్లో ప్రాణరక్షణ కోసం అగ్రికల్చర్ డ్రోన్లు

పనితీరు పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 24)
గోదావరి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సరికొత్తగా అగ్రికల్చర్ డ్రోన్లు వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఖమ్మం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డ్రోన్ పనితీరుపై ఐడీఓసీ ప్రాంగణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గజ ఈతగాళ్లు వరదల సమయంలో చేపట్టనున్న రక్షణ చర్యలను కలెక్టరుకు వివరించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో జిల్లాలో వరదల తాకిడి అధికంగా ఉంటుందని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజల్ని రక్షించేందుకు ఈసారి సరికొత్తగా అగ్రికల్చర్ డ్రోన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలను వరదముంపు నుంచి రక్షించేందుకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న, కొట్టుకుపోతున్న వ్యక్తులను రక్షించేందుకు అగ్రికల్చర్ డ్రోన్లను ఉపయోగిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వరదల్లో చిక్కుకుపోయినవారికి మంచినీటితో పాటు ఆహారపదార్థాలను కూడా వీటి ద్వారా అందిస్తామని తెలిపారు. డ్రోన్ 90మీటర్ల ఎత్తు, 250మీటర్ల దూరం
వరకు ఎగిరే అవకాశముందని, దీని ద్వారా వాగులు, లోలెవెల్ వంతెనల వద్ద చిక్కుకుపోయిన వ్యక్తులకు తాళ్లను పంపి రక్షించవచ్చునని చెప్పారు. అగ్రికల్చర్ డ్రోన్లను వినియోగించే విధానంపై సిబ్బందికి సరైన అవగాహన కల్పిస్తామని చెప్పారు. వరదల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్నదే ప్రధాన ధ్యేయమన్నారు. అన్ని రకాల ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకుని అధికారులు వరదల సమయంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఫిషరీస్ ఏడీ వీరన్న, ఏఓ గన్యా, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, తదితరులు పాల్గొన్నారు.