సీబీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు


✍️ దివిటీ – హైదరాబాదు (జూన్ 21)
హైదరాబాదులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) ఆధ్వర్యంలో కోఠీలో ఉన్న గాంధీ జ్ఞానమందిర్ యోగా కేంద్రం సహకారంతో శుక్రవారం “10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం” వేడుకలు నిర్వహించారు. యోగాను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన ఈ వేడుకల్లో పలువురు యోగా ప్రియులు, శిక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ జ్ఞాన మందిరం యోగా కేంద్రం డైరెక్టర్ రవీంద్ర కపాడియా మాట్లాడుతూ, అన్ని వయసుల వారు మంచి ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు.
‘యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ’ అనే ఈ ఏడాది యోగాడే స్లోగన్ గురించి వివరిస్తూ, ఆరోగ్యవంతులతో కూడిన దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి పౌరుడు యోగా సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దేశ అభివృద్ధికి దోహదపడతామని హైదరాబాదు సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు అన్నారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డీడీఓ పి.వి.ఎస్.శాస్త్రి మాట్లాడుతూ, యోగాను అభ్యాసం చేసిన తర్వాత వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడిన వ్యక్తులను ఉదహరిస్తూ యోగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. సీనియర్ యోగా గురువు మహేష్ ప్రసాద్ యోగా సెషన్ నిర్వహించగా, పలువురు ఔత్సాహికులు, శిక్షకులు, సీబీసీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
————————-
యోగా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
————————-
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీబీసీ ఆధ్వర్యంలో యోగాపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు, పాల్గొన్నవారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, బహుమతులను సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు, సీనియర్ ఏఓ పి.వి.ఎస్.శాస్త్రి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ఎల్పీ రాజు, రవీంద్ర కపాడియా అందజేశారు. జూనియర్స్ విభాగంలో సెయింట్ ఆడమ్స్ హైస్కూల్కు చెందిన హరిచందన్ ప్రథమ బహుమతి సాధించగా, జీఎంపీఎస్, అలియాకు చెందిన సస్వత్ ద్వితీయ, జీఎంహెచ్ఎస్, అలియాకు చెందిన శివేష్ మిశ్రా తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్స్ విభాగంలో ఆర్.గాయత్రి ప్రథమ బహుమతి, యోగా టీచర్ పి.రాధిక ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని యోగా గురువు పి.రవి గెలుచుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్
కరీనా బి.తెంగమం, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా, సిబ్బంది పాల్గొన్నారు.