ముంపు ప్రాంత మండలాల్లో పర్యటించిన కలెక్టర్


✍️ దివిటీ మీడియా
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వరద ముంపు ప్రాంత మండలాలైన చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో ఆయన బుధవారం పర్యటించారు. చర్ల మండలం దండుపేట, రాళ్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఇరిగేషన్, రెవిన్యూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది వరదల తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏడు ముంపు మండలాల గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా చర్ల మండలంలో దేవరపల్లి, దుమ్ముగూడెం మండలం పర్ణశాల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా త్వరగా లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బడి బయట ఉన్న పిల్లలను త్వరగా గుర్తించి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు కృషి చేస్తోందని, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు,ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డీఈ జె.తిరుపతి, ఏఈ ఉపేందర్, ఆర్.డబ్ల్యు.ఎస్ ఏఈ రాము, చర్ల, దుమ్ముగూడెం తహసిల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.