కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్

ప్రభుత్వం ప్రజాసేవకే అంకితమై ఉంది : అశ్వనీవైష్ణవ్
✍️ న్యూఢిల్లీ – దివిటీ మీడియా (జూన్ 11)
కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై ఉందన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం పేదల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమన్నారు. దేశ ప్రజలకు తమ ప్రభుత్వం నిరంతరం సేవ చేస్తూనే ఉంటుందన్నారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించే అవకాశమిచ్చిన ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు ఈ శాఖకు అనుబంధంగా పనిచేసే మీడియా యూనిట్లు, ఇతర ప్రభుత్వ అధికారులు మంత్రి వైష్ణవ్ కు స్వాగతం పలికారు.