పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి
గొందిగూడెం ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍️ దివిటీ మీడియా – భద్రాచలం (మే 11)
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాలలను పునఃప్రారంభించేలోగా మైనర్ రిపేర్లు, ప్యాచ్ వర్కులు, డ్యూయల్ డెస్క్ బల్లలు రిపేర్లు చేయించి పూర్తిస్థాయి సౌకర్యాలుండే విధంగా స్పెషలాఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఆశ్రమపాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్స్, వాష్ రూమ్స్, డార్మెటరీ, తరగతి గదులను ఆయన పరిశీలించారు. సెలవులు ఇచ్చినప్పటినుంచి ఆ పాఠశాలను, తరగతి గదులను శుభ్రం చేయకుండా ఉండడంతో సంబంధిత హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు పాఠశాల శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులున్నందున తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠశాలకు సంబంధించిన ప్యాచ్ వర్కులు, మైనర్ రిపేర్లు చేయించాలని, ప్రతి తరగతిగది, డైనింగ్ హాలు, డార్మెటరీలలో గాలి,వెలుతురు సక్రమంగా వచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో వెంటి లేటర్ల నుంచి క్రిమికీటకాలు లోపలకు రాకుండా మెస్ అమర్చాలని, డార్మెటరీ, తరగతి గదులకు ఆల్ఫాబెట్స్ ప్రకారం నంబర్లు వేయాలని, విద్యార్థులు పడుకునే గదులలో నాలుగు బెడ్లకు కలిపి ఒక ఫ్యాన్ తప్పనిసరి గా ఉండాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వేర్వేరుగా ఉండాలని, పాఠశాలలకు సంబంధించిన మైనర్ రిపేర్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అమర్చే పనులు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించి 20వ తేదీ నాటికి పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. విద్యార్థులు కింద పడుకోకుండా డబుల్ కాట్స్ (మంచాలు) ఫిట్ చేయించి ప్రతి విద్యార్థి మంచాల మీదే పడుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. డ్యూయల్ డెస్క్ బల్లలు పాడైపోతే వెంటనే రిపేరు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు టాయిలెట్స్, వాష్ రూమ్స్ లో శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, ఫ్లోరింగ్ పగళ్లు తేలి ఉండడంతో తప్పనిసరిగా ప్యాచ్ వర్క్ చేయించాలని, యాసిడ్ తో శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తాచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, డ్రైనేజీలలో మురికినీరు నిల్వలేకుండా చూడాలన్నారు. పాఠశాలలో తెరిచే నాటికి విద్యార్థులు రాగానే వారు ఇంటిని మర్చి పోయేలా మంచి వసతి, సౌకర్యాలు కల్పించి, విద్యకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరోసారి ఆకస్మిక తనిఖీకి వచ్చేనాటికి ఆశ్రమ పాఠశాలల్లో అన్ని రకాల పనులు పూర్తి కావాలని, లేకపోతే సంబంధిత సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గదులు, డబుల్ కాట్ మంచాలు, గోడలకు జరుగుతున్న ప్యాచ్ వర్క్ లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డీటీ (ఆర్ఓఎఫ్ఆర్) శ్రీనివాస్, ఏడీఏ భాస్కరన్, గొందిగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం రామారావు, తదితరులు పాల్గొన్నారు.