పోలింగ్ సందర్భంగా వాలంటీర్స్ నియామకం
✍️ దివిటీ మీడియా – మణుగూరు (మే 10)
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 13వ తేదీన జరుగనున్న పోలింగ్ లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా వాలంటీర్స్ ను నియమించినట్లు పినపాక(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మణుగూరులోని తహసిల్దార్ కార్యాలయంలో పినపాక నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లలో వాలంటీర్లుగా విధులు నిర్వహించే సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారుచేసిన టీషర్టులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలోని 250 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు వాలంటీర్లు సహాయ సహకారాలందిస్తారని తెలిపారు. అదేవిధంగా మణుగూరులోని మండల పరిషత్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన ఈవీఎం మిషన్లు ,ఎన్నికల సామాగ్రితో పోలింగ్ సిబ్బంది వారికి సంబంధించిన పోలింగ్ స్టేషన్లకు బయలుదేరే వరకు వారికి అన్ని విధాల సహకారం అందించడానికి ప్రత్యేకంగా ఈ వాలంటీర్లను నియమించినట్లు వెల్లడించారు. వాలంటీర్లుగా నియమించబడ్డ సిబ్బంది ఎన్నికల అధికారులు, సపోర్టింగ్ సిబ్బందికి ఏమాత్రం అలసత్వం లేకుండా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.