ఎన్నికల సామగ్రి తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎన్నికల ఏర్పాట్లు సమీక్షించివ పినపాక ఈఆర్ఓ ప్రతీక్ జైన్
✍️ దివిటీ మీడియా – భద్రాచలం, మార్చి 27
పార్లమెంటు ఎన్నికలకోసం పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకూలమైన రూట్ మ్యాప్ తయారుచేసి ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని పినపాక నియోజకవర్గ ఈఆర్ఓ, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతిక్ జైన్ ఆదేశించారు. ఈ అంశంబో సంబంధిత డీఎస్పీలు, సెక్టోరల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి పినపాక నియోజకవర్గ పరిధిలోని సెక్టోరల్ అధికారులు, తహసిల్దార్లు,, సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లకు ఎన్నికలసామగ్రి, సిబ్బందిని చేరవేయడానికి నిర్దిష్టమైన రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవాలని, ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే రెండు రోజుల్లో వాటి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, డీఎస్పీల ద్వారా పోలీసుల సహకారం తీసుకుని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకోవాలన్నారు. పెండింగులోని ఓటర్లకు సంబంధించిన అన్ని ఫామ్స్ అంశాలు, దివ్యాంగులు, 85 సంవత్సరాలు పైబడిన వృద్ధ ఓటర్లకు సౌకర్యాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్, ర్యాంపులు, వాష్ రూమ్స్, విద్యుత్తు, సరిపడా ఫర్నిచర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు వారి రూట్ లోని పోలీస్ స్టేషన్లు ఏవైనా అనుకూలంగా లేకపోతే గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలలు, గురుకులం పాఠశాలల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ ప్రతీక్ జైన్, వీడియో కాన్ఫరెన్సుకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఎలక్షన్ డీటీ నాగరాజును ఆదేశించారు. కార్యక్రమంలో మణుగూరు, ఇల్లందు డీఎస్పీలతోపాటు పినపాక నియోజకవర్గ పరిధిలోని తహసిల్దార్లు, సీఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.