Divitimedia
HyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై విచారణకు సీఎం నిర్ణయం

గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై విచారణకు సీఎం నిర్ణయం

విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ కు విచారణ బాధ్యతలు

ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు

ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ

పశు సంవర్థకశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

✍ దివిటీ మీడియా – హైదరాబాదు, మార్చి 5

రాష్ట్రంలో గొర్రెలు, చేపలపంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధకశాఖ, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని ఇటీవల కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్ని సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు తమ తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో జరిగిన ఏసీబీ దర్యాప్తులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా? అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ.3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కోపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపి వేసిందని అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకతవకలను గుర్తించడం, తదితర కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడతలో 85488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారని, దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

పాడి రైతులకు ప్రభుత్వం ఒక్కో లీటరుపై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మూడేళ్లుగా ఇవ్వడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ప్రతినెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకవసరమైన టెండర్లు వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలించాలని, వైద్యారోగ్యశాఖలో అమలైన ఈ వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ ఆధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల

Divitimedia

Divitimedia

మునగసాగు రైతుల పాలిట వరం

Divitimedia

Leave a Comment