Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

కొట్టివేతలు… దిద్దుబాట్లతో అక్రమాలు కప్పే యత్నం

కొట్టివేతలు… దిద్దుబాట్లతో అక్రమాలు కప్పే యత్నం

అక్రమాలకు నిలయంగా బూర్గంపాడు ఈజీఎస్ పనులు

సామాజిక తనిఖీ ప్రజావేదికలో 36మందికి షోకాజ్ నోటీసులు

✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 27

నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పథకం, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది కారణంగా అవినీతిమయంగా మారిపోయింది. బూర్గంపాడు మండలంలో గతేడాది జరిగిన ఉపాధిహామీ పథకం పనులపై ‘సోషల్ ఆడిట్’లో వెలుగు చూసిన పలు అంశాలపై మంగళవారం బహిరంగ ప్రజావేదికలో వాడివేడిగా చర్చ జరిగింది. మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేదికలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత అవకతవకలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ పథకంలో పనులు చేసిన కూలీలకు వేసిన హాజరు (మస్టర్లు) స్థాయి నుంచే అవినీతికి దారులు వెతికినట్లు వెల్లడవుతోంది. అనేక మస్టర్ల రికార్డులలో విపరీతంగా కొట్టివేతలు, దిద్దుబాట్లు, టాంపరింగ్ జరిగినట్లు ‘సోషల్ ఆడిట్’లో ఆడిట్ సిబ్బంది గుర్తించిన విషయం ప్రజావేదికలో వెల్లడి చేశారు. ఇప్పటికే బూర్గంపాడు మండలం పరిధిలో ఉపాధిహామీ పథకం అక్రమాలపై తీవ్రస్థాయిలో ఓ వైపు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాల పట్ల మరింత దుమారం రేగింది. మండలంలో ఈ అక్రమాలకు సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి కారణంగా అర్థమవుతోందంటూ జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత తీవ్రంగా నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పడం కోసం ఉపాధిహామీ పథకం ఏపీఓ విజయలక్ష్మి, ఆ అక్రమాలకు బాధ్యులైన సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మండలం పరిధిలోని ప్రతి పంచాయితీలో కూడా అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నా ఎందుకు నిరోధించడం లేదంటూ అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వ్యక్తులు ఉపాధిహామీ పర్యవేక్షణాధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాల ఆధారంగా మొత్తం 36మంది ఉపాధిహామీ పథకం పనులలో భాగస్వాములైన సిబ్బందికి ‘షోకాజ్ నోటీసులు’ జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇంత జరిగినా మండలంలో అక్రమాలకు బాధ్యులైన సిబ్బందికి కేవలం రూ.22,000 జరిమానా విధించి, మరో రూ.72,000 ‘రికవరీ చేయాలని’ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నివేదించడం విశేషం. ఈ అంశాలు పరిశీలిస్తే బూర్గంపాడు మండలంలో ఉపాధిహామీ పథకంలో వెలుగుచూడని అక్రమాలు మరెన్నో ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రజావేదికలో జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, డీఆర్డీఏ అదనపు పీడీ రవి, అంబుడ్స్ మెన్ నాగప్రకాష్, జిల్లా విజిలెన్స్ అధికారి అనూష, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఈ వెంకటేశ్వరరావు, ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దూరవిద్య ద్వారా ఉన్నత చదువులకు అవకాశం

Divitimedia

ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు నిర్మించుకోవాలి

Divitimedia

నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం

Divitimedia

Leave a Comment