Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StylePoliticsSpot NewsTechnologyTelanganaWomen

‘ఉపాధి అక్రమాల’పై నిలదీసిన జడ్పీటీసీ సభ్యులు

‘ఉపాధి అక్రమాల’పై నిలదీసిన జడ్పీటీసీ సభ్యులు

ఆసుపత్రులలో ప్రసవ మరణాలపైనా సభ్యుల ఆందోళన

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 20

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండలాల్లో ‘ఉపాధి హామీ పథకం’ లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై పక్కాగా విచారణలు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నిలదీశారు. మంగళవారం కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్మన్ కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కారణంగా ప్రసవ మరణాలు చోటుచేసుకుంటూ కుటుంబాలకు తీరనిశోకం మిగులుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో సహా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి, గుండాల, చర్ల, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, తదితర మండలాల్లో ఉపాధి హామీ పథకం పనుల్లో నకిలీ మస్టర్లతో నిధులు స్వాహా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారాలపై తాము స్వయంగా పరిశీలించి ఫిర్యాదులు చేస్తే, ఎంపీడీఓ, సోషల్ ఆడిట్ విచారణలలో కూడా మేనేజ్ చేసుకుంటూ అక్రమాలు కొనసాగిస్తున్నారని కలెక్టర్ డా.ప్రియాంకఅలకు సభ్యులు తెలిపారు. పక్కాగా విచారణలు జరిపాలంటూ కోరారు. క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, పి.హెచ్.సిల నుంచి సి.హెచ్.సిలు, ఏరియా ఆసుపత్రులకు రిఫర్ అవుతున్న ప్రసవాలలో సిఫార్సుల అండలేని పేదలకు సరైన వైద్యం చేయడం లేదని ఆరోపించారు. పరిస్థితులు చేయిదాటి పోయే వరకు ఉండి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులకు సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాసుపత్రులలో పరిస్థితులను సమీక్షించి, సరిదిద్దాలని ఈ సమావేశంలో సభ్యులు కోరారు. ఎంఈఓల కొరత వల్ల పాఠశాలలపై పర్యవేక్షణ లేక చదువులు సక్రమంగా సాగడం లేదని కూడా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నిలదీశారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకంలో స్పష్టత కొరవడిందని ఆరోపించిన సభ్యులు, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి రైతుబంధు అమలు చేయాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేలు

సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్మన్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులలో అర్హులైనవారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయం, వైద్యం, విద్యా, గ్రామీణాభివృద్ధి, జిల్లా స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖలపై సర్వసభ్య సమావేశంలో సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలలో రెండు అమలయ్యాయని, జడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చించిన అంశాలపై లోతుగా విశ్లేషించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. తీసుకున్న చర్యలపై సభ్యులకు నివేదికల ప్రతులు కూడా అందజేయాలని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ, సభ్యులు లేవనెత్తిన అంశాలపై జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించాలని, కొత్తగూడెం మాతా, శిశు ఆసుపత్రి సక్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలోని బెడ్స్ మీద దుప్పట్లు విధిగా మార్చేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టరును కోరారు. ప్రస్తుత పాతబడిన భవనానికి బదులుగా నూతనంగా జడ్పీ కార్యాలయం విశాలంగా నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. వచ్చే ఎండాకాలంలో గ్రామీణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వైరా శాసనసభ్యుడు రాందాస్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వం ఇంటి నంబర్లు కేటాయించవలసిందిగా కోరారు. జిల్లాలో 1/70 యాక్ట్ అమలులో ఉన్నందున ఇంటినెంబర్ల కేటాయింపు జరగలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవనాలు కొన్ని శిధిలావస్థకు చేరాయని, వాటికి రిపేరు, వీలున్న చోట నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మాట్లాడుతూ, చాలావరకు ప్రజా ప్రతినిధుల సమస్యలు విన్నామని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సత్వరంగా పరిష్కారాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు తెప్పించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు తీసుకుని వచ్చే సమావేశంలో నివేదికలిస్తాం : కలెక్టర్ డా.ప్రియాంకఅల

జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలకు పూర్తిగా సమాచారం ఇవ్వలేకపోయామని, అధికారుల బదిలీల వల్ల వీలుపడలేదని వివరించారు. ఈ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై వచ్చే సమావేశంనాటికి అన్ని సమస్యలు పరిష్కరించి నివేదిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా జాబ్ కార్డ్స్ మంజూరు సమస్యలు, నకిలీ మస్టర్ రోల్స్ వేయడం, అంగన్వాడీ పాఠశాలల్లో సమస్యలపై తనిఖీలు చేసి యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ఏటీఆర్) అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ దగ్గరున్న ‘యాస్పిరేషన్స్ నిధుల’ నుంచి పాఠశాలలు,అంగన్వాడీలు, ఆస్పత్రులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.ఈ వేసవికాలంలో గ్రామీణ ప్రజలకు మంచినీటి సరఫరా కోసం తన పరిధిలో నిధులు లేకపోయినా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు తెప్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, డీఆర్డీఓ విద్యాచందన, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఊరచెరువును అభివృద్ధి చేస్తాం, అనుమతించండి

Divitimedia

కొత్తగూడెంలో ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ 5కె రన్

Divitimedia

ఎస్సీఅర్పీలు మరింత బాధ్యతగా పని చేయాలి

Divitimedia

Leave a Comment