పాత బ్రిడ్జి బాగుచేయరు… కొత్త బ్రిడ్జి పూర్తి చేయరు…
కొత్తగూడెం ముర్రేడుబ్రిడ్జిపై ట్రాఫిక్ కష్టాలు తీరేదెన్నడు…?

తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వేలమంది ప్రయాణికులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 16)
ప్రతిరోజూ వేలసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే బ్రిడ్జిపై ఏర్పడిన గోతులతోపాటు, రద్దీ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాహనాల రద్దీని తగ్గించేందుకు, ప్రయాణం సులభతరం చేసేందుకు ఆ బ్రిడ్జి పక్కనే నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు నత్తనడకను గుర్తుకు తెస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో ఏడేళ్లకు పైగా నెలకొన్న దుస్థితి ఇది… కొత్తగూడెంలో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ముర్రేడువాగు రెండో బ్రిడ్జి పనులు పూర్తిచేసేందుకు ఆపసోపాలు పడుతున్న కాంట్రాక్టర్లు, జాతీయ రహదారుల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లక్రితం నుంచి ఉన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం, పనులు ఆరంభం కావడంతో ప్రయాణ కష్టాలు తీరుతున్నాయని సంబరపడిన స్థానికులకు ఆ ఆనందం ఎంతోకాలం నిలవనేలేదు. రెండో బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు దృష్టి సారించకపోవడం వల్ల దాదాపు ఏడేళ్లకు పైగా ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. విజయవాడ- భద్రాచలం- కుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్తగూడెం సమీపంలోని రామవరం నుంచి భద్రాచలం వరకు దాదాపు రూ.187కోట్ల పైగా అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే కొత్తగూడెం పట్టణంలో ముర్రేడు వాగుపై రెండో వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రారంభించి ఏడేళ్లు దాటినా, నత్తనడకన సాగుతున్న ఈ వంతెన పనులు నేటికీ పూర్తి కాలేదు. వంతెనలో ప్రధాన భాగం దాదాపు పూర్తయినా, రెండువైపులా ఉన్న అప్రోచ్ పనులలలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. నత్తనడకన సాగుతూ మధ్యమధ్యలో నిలిచి పోతున్న పనులు దాదాపు ఏడాది క్రితం పునఃప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పనుల గురించి జాతీయ రహదారుల విభాగం అధికారులను సంప్రదించగా, త్వరగా పూర్తి చేస్తామని వారు చెప్పినప్పటికీ, నేటికీ తీవ్ర జాప్యం జరుగుతోంది. వంతెన పనులు పూర్తి కాకపోవడం, పాత బ్రిడ్జిమీద తరచుగా ఏర్పడుతున్ప గోతులను సక్రమంగా పూడ్చి మరమ్మతులు చేయకపోతుండటంతో కొత్తగూడెం ముర్రేడువాగు వంతెనపైనుంచి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు సాగుతున్న ఈ జాతీయరహదారి మీద ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో నిత్యం వేలాది వాహనాలు ఈ పాత బ్రిడ్జిపైనుంచే వెళ్తుంటాయి. ఈ వాహనాలకు తోడు పట్టణంలో స్థానికంగా ప్రయాణాలు చేసే వాహనాలు కూడా పెద్దసంఖ్యలో ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణంలోనుంచి నవభారత్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘ప్రభుత్వ జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)’కు నిత్యం వేలమంది ఉద్యోగులు, పట్టణవాసులు, ఇతర ప్రాంతాల ప్రజలు ఈ బ్రిడ్జిపైనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఆరేళ్ల క్రితం నాటితో పోల్చితే వాహనాల సంఖ్య, రాకపోకలు దాదాపు రెట్టింపయ్యాయి. సగం సామర్థ్యం మాత్రమే ఉన్న పాత వంతెన పైనుంచి పెద్దసంఖ్యలో రాకపోకలు సాగుతుండటం, అందులోనూ వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఇదే పాత బ్రిడ్జిపై అడుగడుగునా తరచూ గోతులేర్పడుతున్న దుస్థితిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం రూ.కోట్లు మంజూరుచేసి రెండో వంతెన నిర్మాణ పనులు చేపట్టగా ఆ పనులు ఆలస్యమవుతున్నాయి. వాహనాల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులు, జరుగుతున్న ప్రమాదాల గురించి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండగా, అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలువురు స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘దేవుడు కరుణించినా… పూజారి అడ్డు పడుతున్నట్లు’గా కాంట్రాక్టర్లు, నేషనల్ హైవేస్ అధికారుల నిర్లక్ష్యంతో తాము అవస్థలు పడుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ రెండో బ్రిడ్జి పనులు, పాత బ్రిడ్జి మీద మరమ్మతుల విషయంలో ఉన్నతాధికారులు స్పందించి, పనులు త్వరగా పూర్తి చేయించి, తమ ప్రయాణ కష్టాలను తొలగించాలని స్థానికులు, అంతర్రాష్ట్ర ప్రయాణికులు కోరుతున్నారు. ఈ పనులు, ప్రజల సమస్య గురించి ‘దివిటీ మీడియా’ నేషనల్ హైవేస్ డీఈ శైలజను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె స్పందించలేదు.




