ఢిల్లీలో తెలంగాణ నూతన భవనం : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
ఢిల్లీలో ఆంధ్ర, తెలంగాణ ఆస్తుల వివరాలపై ఆరా తీసిన సీఎం
✍🏽 దివిటీ – ఢిల్లీ, హైదరాబాదు
దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం (డిసెంబర్ 19) సమీక్షించారు. ఆ ప్రాంగణం మొత్తం విస్తీర్ణం, అందులో ఉన్న భవనాలు, వాటి పరిస్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆ వివరాలు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. అందులో ఉమ్మడి పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించగా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 8.245 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.536 ఎకరాలు (41.68 : 58.32 నిష్పత్తిలో) చెందుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాసగృహాల స్థితిపై కూడా సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్రానికి నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఉన్న భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.