సత్తుపల్లిలో తెలంగాణ, ఏపీ సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారుల సమావేశం
ఎన్నికల సక్రమ నిర్వహణకు సహకారించాలని కోరిన ఖమ్మం కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – సత్తుపల్లి, ఖమ్మం
స్వేచ్ఛ న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల అధికారులు సమన్వయంతో సహకారం అందించాలని ఖమ్మం జిల్లాకలెక్టర్ వి.పి.గౌతమ్ కోరారు. సోమవారం సత్తుపల్లిలో స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.టి.ఆర్., ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30వ తేదీన పోలింగ్ జరుగుతున్నందున ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలను నియంత్రించి, ఓటర్లు స్వేచ్ఛగా న్యాయబద్దంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, ఎన్టిఆర్ జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణలో కోడ్ (ఎన్నికల నిబంధనలు) అమలులో ఉండగా సరిహద్దు రాష్ట్రంలో నిల్వలు ఉంచి అక్కడి నగదు, మధ్యం తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని వేర్హౌస్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లలో తణిఖీలు చేపట్టి అక్రమ నిల్వలపై చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు మండలాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. అనుమానిత బ్యాంకు లావాదేవీలు, ఒక ఖాతా నుంచి ఒకేరోజు పదికంటే ఎక్కువ ఖాతాలకు యూపీఐ ద్వారా నగదు బదిలీ, ఎక్కువ మొత్తంలో నగదు ‘డ్రా’లపై పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దులలోని ప్రజలకు సి-విజిల్ యాప్పై అవగాహన కల్పించి విస్తృతప్రచారం ద్వారా చైతన్యం తేవాలన్నారు. సమావేశంలో ఖమ్మం పోలీసు కమీషనర్ విష్ణు యస్.వారియర్ మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర జిల్లాలతో సమన్వయంతో, ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రణకోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు 266 కిలోమీటర్ల నిడివితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు, ఎన్టిఆర్ జిల్లాల సరిహద్దు ఉందన్నారు. 12 మేజర్ రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటల నిరంతర నిఘాపెట్టినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దు రాష్ట్ర, జిల్లాల అధికారులు అవసరం దృష్ట్యా ఎక్కడెక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలో చేసి 24 గంటల నిఘా ఉంచాలని కోరారు. పోలింగ్ రెండు రోజుల ముందు సరిహద్దు గ్రామాల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, అనుమానిత చర్యలు సోషల్ మీడియాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఒకరినొకరు తమ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు.
సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆoధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, ఏఎస్ఆర్, చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాల సరిహద్దులున్నాయని తెలిపారు. మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలని కోరుతూ, అక్రమ మద్యం చాలా తక్కువ సీజ్ అవుతున్నట్లు తెలిపారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ మాట్లాడుతూ, చెక్పోస్టులలో తనిఖీల డాటా ఎన్నికలసంఘం పర్యవేక్షిస్తున్నట్లు చెప్తూ, తనిఖీలు సీరియస్గా చేపట్టాలని కోరారు. సమావేశంలో ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ, సరిహద్దు జిల్లాల సహకారానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ఎస్ఎస్టిలు ఏర్పాటుచేసి, వాటికి తగినంత సిబ్బందిని నియమించి, ఏరోజు సీజింగ్ వివరాలు సమాచారం ఆరోజు ఇస్తామన్నారు. బ్యాంక్, యూపిఐ లావాదేవీలు పర్యవేక్షిస్తామని తెలిపారు. సమస్యాత్మక రహదారులపై టీమ్లు ఏర్పాటు చేసి, బాధ్యతాయుతంగా నిబద్దతతో విధులు చేపట్టి సహకరిస్తామని అన్నారు. సమావేశంలో ఎన్టిఆర్ జిల్లా డిసిపి అజిత మాట్లాడుతూ, జిల్లాలో 12 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిపారు. తెలంగాణాతో ఉన్న 239కిలోమీటర్ల సరిహద్దులో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 8 వందలకు పైగా వ్యక్తులను బైండోవర్ చేశామని, అంతర్ జిల్లాల అధికారులతో 20కి పైగా సమావేశాలు నిర్వహించి అక్రమ మధ్యం అదుపుకోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ రెండురోజుల ముందు నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏలూరు జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ, తెలంగాణతో ఏలూరు జిల్లాకు 11సరిహద్దు గ్రామాలున్నాయని తెలిపారు. 7 చెక్పోస్టులు పెట్టి 24 గంటల నిఘా చేపట్టామన్నారు. మద్యం, అనుమానిత నగదు లావాదేవీలపై నిఘా పెడతామన్నారు. ఏరోజుకారోజు నివేదికలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ డిసిపి ప్రసాదరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఎన్టిఆర్, ఏలూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు,ఎక్సైజ్, బ్యాంకింగ్, కోఆపరేటివ్ అధికారులు పాల్గొన్నారు.