జియోగ్రఫీ విభాగంలో అంబేద్కర్ కు ఓయూ డాక్టరేట్
✍🏽 దివిటీ మీడియా – సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి గొల్లబోయిన అంబేద్కర్ ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) జియోగ్రఫీ విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందారు. సూర్యాపేట రెవిన్యూ డివిజన్, నల్గొండ జిల్లా, తెలంగాణలో ‘షెడ్యూల్డ్ కులాలు- సామాజిక ఆర్ధికాభివృద్ధి యొక్క ప్రాదేశిక విశ్లేషణ’ అనే అంశాలపై ఓయూ ప్రొఫెసర్ నాగేష్ (ఆడిట్ సెల్ డైరెక్టర్) పర్యవేక్షణలో పరిశోధనకుగాను ఓయూ పరీక్షల విభాగం అంబేద్కర్ కు డాక్టరేట్ ప్రకటించింది. ఈ డాక్టరేట్ పట్టాను బుధవారం నిర్వహించిన ఓయూ 83వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, ఆడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ చేతుల మీదుగా అంబేద్కర్ అందుకున్నారు. పేద కుటుంబానికి చెందిన పుష్పలత, అక్కులు కొడుకైన అంబేద్కర్, చదువు వల్లనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఉన్నత చదువుల దిశగా పయనించాలనే తపనతో డా.బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో చదివారు. ప్రాథమిక విద్యాభ్యాసం జాజిరెడ్డిగూడెంలో, ఆ తర్వాత విద్య మోత్కూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ ప్రభుత్వ కాలేజీలో పూర్తి చేశారు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ జియోగ్రఫీ విభాగంలో చేసిన పరిశోధనతో ఓయూలో అంబేద్కర్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. పరిశోధన సమయంలో ఆయన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని, తన పరిశోధనపత్రాలు సమర్పించారు. అంబేద్కర్ కు డాక్టరేట్ రావడం పట్ల అధ్యాపకులు, మిత్రులు, గ్రామస్థులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తంచేశారు. తన పరిశోధన సమయంలో సహకరించిన మిత్రులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
